తాడిపత్రి మున్సిపల్ పంచాయితీ; జేసీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి .. మున్సిపల్ సిబ్బందికి వంగి వంగి దండాలు !!
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుకుంటుంది. మున్సిపల్ చైర్మన్ హోదాలో మున్సిపల్ అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహిస్తే కూడా అధికారులు హాజరు కావడం లేదు. సిబ్బంది గైర్హాజర్ కావడంతో 26 మంది సిబ్బంది కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు వినూత్నంగా నిరసన తెలియజేసి అధికారులు రాగానే లేచి వారికి వంగి వంగి దండాలు పెట్టారు. మున్సిపల్ అధికారుల పని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆయన ఆందోళన బాట పట్టారు.

మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. గైర్హాజర్ అయిన అధికారులు
అసలేం జరిగిందంటే మున్సిపల్ చైర్మన్ హోదాలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆయన శనివారమే అందరికీ తెలియజేశారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మునిసిపల్ సిబ్బందితో కరోనా వైరస్ మూడోదశపై అవగాహన ర్యాలీ, సమావేశం నిర్వహించారు. దీంతో అధికారులకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరు కాక తప్పలేదు.

ఎమ్మెల్యే ర్యాలీకి హాజరై .. సమీక్షకు డుమ్మా , జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన
అయితే ర్యాలీ అనంతరం సమావేశానికి వస్తారని భావించిన జెసి 12:30 వరకు కౌన్సిలర్లతో కలిసి కార్యాలయంలోనే ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ మున్సిపల్ సిబ్బంది డుమ్మా కొట్టారు. మునిసిపల్ సిబ్బంది ఎవరూ కార్యాలయానికి రాకపోవడంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులు కార్యాలయాలకు వచ్చేవరకూ వెళ్ళేది లేదంటూ తన ఛాంబర్ లోనే ఉండిపోయారు. ఇక ఈ గందరగోళం మధ్య మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి మధ్యాహ్నం సెలవుపై వెళుతూ ఇతరులకు బాధ్యత అప్పగించి వెళ్ళిపోయారు.

అధికారులపై జేసీ వినూత్న నిరసన ... వంగి వండి దండాలు పెట్టి
సాయంత్రం నాలుగు గంటలకు కార్యాలయానికి వచ్చిన అధికారుల పట్ల జెసి వినూత్నంగా తన నిరసన తెలియజేశారు. వారికి వంగి వంగి దండాలు పెట్టి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇక సమాచారం కూడా ఇవ్వకుండా కమీషనర్ సెలవుపెట్టి వెళ్లడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనకు మాట మాత్రం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు . సమీక్ష సమావేశానికి హాజరు కాకుండా, తన ఆదేశాలను పట్టించుకోని 26 మంది మున్సిపల్ సిబ్బందికి నోటీసులు జారీ చేస్తున్నట్టు వెల్లడించారు.

మున్సిపల్ సిబ్బంది కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు .. ఇంకా చాంబర్ లోనే జేసీ
అంతేకాదు 26 మంది మున్సిపల్ సిబ్బంది కనిపించడం లేదంటూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కమిషనర్ వచ్చేవరకు కార్యాలయంలో ఉంటానని చెప్పిన ఆయన రాత్రి భోజనం చేసి అక్కడే నిద్ర పోయారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
మున్సిపల్ చైర్మన్ హోదాలో ఆయన పట్టు దక్కించుకున్నా అధికారులతో పని చేయించలేకపోతున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications