హరీశ్-దేవినేని.. ఇద్దరూ అన్నదమ్ముల్లా ఆలోచించండి : సోమిరెడ్డి
నెల్లూరు : కృష్ణా నదిపై ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల మధ్య పేచీ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించారు టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇరు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమా మహేశ్వరావు అన్నదమ్ముల్లా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారాయన.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్బంగా సోమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు సాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితి నెలకొందని, రెండు రాష్ట్రాల నుంచి ఎదురవుతోన్న ప్రభుత్వాల ఒత్తిడులకు తలొగ్గకుండా నాగార్జున సాగర్ కు నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఓ నిర్ణయానికి రావాలని పేర్కొన్నారు.
శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడుకు 500 క్యూసెక్కులు విడుదల చేయడమేంటని ఈ సందర్భంగా సోమిరెడ్డి ప్రశ్నించారు. గతంలో జరిగిన నీటి ఒప్పందాలను గుర్తు చేస్తూ.. చెన్నైకి కూడా అక్కడి నుంచే నీరు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. రెండు రాష్ట్రాలు కలిసే నీటిని విడుదల చేయాలని, రాయలసీమలో నమోదవుతోన్న అత్యల్ప వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు దృష్టి సారించాలని కోరారు.