ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి...సలహా చెప్పండి:న్యాయనిపుణులను కోరిన సిఎం చంద్రబాబు
అమరావతి:మహారాష్ట్ర ధర్మాబాద్ కోర్టు బాబ్లీ ప్రాజెక్ట్ కేసు విషయమై జారీచేసిన అరెస్ట్ వారెంట్ పూర్వాపరాలను పరిశీలించి సలహా ఇవ్వాల్సిందిగా ఏజీ, న్యాయ నిపుణులను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
గతంలో కేసును డిస్పోజల్ చేసినట్టు వెబ్సైట్లో చూపడం...ఆ తర్వాత పలు సెక్షన్ల కేసు నమోదు చేయడం...నోటీసులు ఇవ్వకపోవడం...హఠాతుగా నాన్ బెయిలబుల్ అరెస్ట్వారెంట్ జారీ చేయడం తదిదర అంశాలను న్యాయనిపుణులకు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు తదుపరి కార్యాచరణపై వారి సలహా అడిగారని తెలిసింది.
మరోవైపు ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు, కేబినెట్ సహచరులతో కూడా చంద్రబాబు ఈ విషయమై చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలువుంటే ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న అమెరికా వెళ్లాల్సివుండగా అందుకు ఈ కేసు ప్రతిబంధకమవుతుందా అనే అంశాన్ని సిఎంవో అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
ఇదిలావుంటే బాబ్లీ ప్రాజెక్ట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఒక వ్యూహం ప్రకారమే రచ్చ రచ్చ చేస్తున్నారని ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారు. అసలు జరిగింది వేరని...పూర్తి వాస్తవాలు బైటకు వెల్లడించకుండా అర్థ సత్యాలతో అనుకూల మీడియాలో ప్రత్యేక కథనాలు వండివార్చేలా చేస్తున్నారని వారు దుయ్యబడుతున్నారు. అసలు వాస్తవాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయని, అసత్యాలతో ఎల్లకాలం మోసగించలేదరని దుయ్యబడుతున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆ సెంటిమెంటు బాగా విస్తరిస్తున్న క్రమంలో టిడిపి ఈ ఆందోళన చేపట్టిందని, ఆ సెంటిమెంట్ ను డైవర్ట్ చేసే లక్ష్యంతోనే టిడిపి ఈ ఉద్యమం చేపట్టిందని అప్పట్లో తెలంగాణా ఉద్యమ నేతలు ఆరోపించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నిజానికి చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతున్న సమయంలోనే ఈ ప్రాజెక్టుకు బీజం పడిందనే విషయాన్ని గమనించాలంటున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్ కు టెండర్లు పిలిచిన విషయం గమనించాలని, అయితే ఆ తరువాత మళ్లీ ఆయనే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం అంటూ బాబ్లీ ప్రాజెక్ట్ వద్దకు వెళ్లాడని వివరిస్తున్నారు.
ఈ క్రమంలో బాబ్లీ వద్దకు మీడియా సైతం రాకుండా ఆంక్షలు పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆక్రమంలో టీడీపీ నాయకులు ఉద్యమం అంటూ రాగానే సహజంగానే అదుపులోకి తీసుకున్నారని, ఆ తరువాత ఒక విమానంలో తీసుకొచ్చి ఎపిలో వదిలేసి వెళ్లారని చెబుతున్నారు. తొలుత వీరిపై ఆందోళనల సందర్భంగా పెట్టే సాధారణ కేసులో పెట్టారని, ఆ కేసులు కొన్ని రోజులకే కొట్టేశారని...ఇప్పుడు చంద్రబాబు అండ్ కో చెబుతోంది ఆ కొట్టేసిన కేసుల గురించేనని ప్రత్యర్థులు అంటున్నారు.
అయితే మహారాష్ట్ర పోలీసులు వీళ్లను అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఈ ఉద్యమ నేతలు పోలీసుల పట్ల చేసిన హడావుడి ఆ సమయంలో వీరిపై మరిన్ని కేసులు పెట్టడానికి కారణమైందని, ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి ప్రయత్నం, అశాంతిని క్రియేట్ చేయడం వంటి కేసులను ఆ సందర్భంలో వీరిపై పెట్టడం జరిగిందని తొలి కేసు కొట్టేసినా ఈ కేసు అలాగే ఉండి విచారణ ప్రక్రియ జరుగుతూనే వస్తోందని, 5 ఏళ్ల క్రితం పోలీసులు ఈ కేసుపై చార్జిషీటు కూడా వేశారని తెలిపారు. ఆ క్రమంలో చంద్రబాబు అండ్ కో కు అనేకసార్లు వారెంట్లు జారీ అయ్యాయని వీరు వివరిస్తున్నారు. అలా నోటీసులు అందుకున్న వారిలో తెరాస నేతలు కూడా ఉన్నారని చెబుతున్నారు.
కావాలంటే ఆ వారెంట్ల వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, అక్కడ చూడొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో కోర్టుకు హాజరుకానుందుకు వీరికి అరెస్ట్ వారీ జారీ కానుందనే విషయం ఒక స్థానిక మీడియా ద్వారా తెలసుకొని దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు టిడిపి పక్కా ప్రణాళిక రచించిందని, ఎన్నో అతి పెద్ద కేసుల్లోనే స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు ఈ కేసు నిజానికి ఒక లెక్కే కాదని, కానీ రాజకీయంగా ఇప్పుడు కీలక తరుణం కావడంతో ఈ కేసు పురోగతిని తమకు అనుకూలంగా మార్చకునేది పెద్ద వ్యూహమే పన్నారని, దాని పర్యవసానమే ఈ రచ్చంతా అని ప్రత్యర్థులు తేల్చేస్తున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు పర్యవసానాలు ఎలా పరిణమిస్తాయనేది వేచిచూడాలి.