బాబుతో టీ-టీడీపీ నేతల భేటీ, ముందే వచ్చిన తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి సనత్ నగర్ శాసన సభ్యుడు, గ్రేటర్ టీడీపీ అధ్యక్షులు తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ భేటీ ప్రారంభానికి పదినిమిషాలు ముందే తలసాని వచ్చారు. తాజా రాజకీయ పరిణామాల పైన వారు చర్చించారు.
కాగా, ఇటీవల తలసాని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగిన విషయం తెలిసిందే. ఆయన కేసీఆర్తో పలుమార్లు భేటీ అయ్యారు. దీంతో ఆయన కారు ఎక్కుతారనే ప్రచారం ఊపందుకుంది. నాలుగైదు రోజుల క్రితం తలసాని సీఎం కేసీఆర్ను కలిసి నిశ్చితార్థానికి ఆహ్వానించారు. అప్పుడు కూడా పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు బాబుతో భేటీకి తలసాని హాజరు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే కేసీఆర్ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని చంద్రబాబు టీటీడీపీ నేతలకు సూచించారు.
గవర్నర్ను కలవనున్న చంద్రబాబు

నారా చంద్రబాబు నాయుడు సోమవారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.
ఉద్యమం ఉధృతం: మంద కృష్ణమాదిగ
ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సుదీర్ఘపోరాటంలో లక్ష్యం చేరుకుని, కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 1994, 1997లో రెండుసార్లు వర్గీకరణ ఆమోదం పొంది, ఐదేళ్ల పాటు అమలు జరిగిందని తెలిపారు.
2004లో మరలా వర్గీకరణ రద్దవడంతో మాదిగల అభివృద్ధి తిరోగమన బాట పట్టిందన్నారు. ఉద్యమాన్ని గల్లీస్ధాయి నుండి ఢిల్లీస్ధాయికి ఉధృతం చేస్తామన్నారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని, రాష్ట్రంలో, కేంద్రంలో కీలకపాత్ర వహిస్తున్న వీరు చొరవతీసుకుంటే వర్గీకరణ జరిగితీరుతుం దన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో వర్గీకరణ సాధించలేకపోయామన్నారు.












Click it and Unblock the Notifications