కెసిఆర్తో ఏకాంతంగా చర్చలు: తలసాని దోబూచులాట
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, సికింద్రాబాద్ మాజీ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరే విషయంపై దోబూచలాడుతున్నట్లు కనిపిస్తున్నారు. తెరాసలో చేరడానికే ఆయన సోమవారం ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తలసాని కలస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, భేటీ తర్వాత కూలిన ఇళ్లను తిరిగి కట్టించాలని కెసిఆర్ను కోరినట్లు తెలిపారు.
అయితే, కెసిఆర్తో తలసాని శ్రీనివాస యాదవ్ గంటసేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. తెరాసలో చేరే విషయంపైనే వారిరువురి మధ్య చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. గతంలో కూడా తలసాని తెరాసలో చేరుతారంటూ పలు సందర్భాల్లో ప్రచారం సాగింది. కెసిఆర్ను ఓ ఉత్సవాన్ని పురస్కరించుకుని తలసాని తన నివాసానికి కూడా ఆహ్వానించారు.
తెలుగుదేశం పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లభించడం లేదని తలసాని శ్రీనివాస యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ శాసనసభలో టిడిపి పక్ష నేత పదవిని ఆశించారని, అది దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. టిడిపి పక్ష నేత పదవిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఇచ్చారు.
తలసాని శ్రీనివాస యాదవ్ ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావుకు సన్నిహితుడు. తలసానిని తెరాసలోకి తేవడానికి పద్మారావు రాయబారం నడిపినట్లు చెబుతున్నారు. తలసాని తెరాసలో చేరడానికి మానసికంగా సిద్ధమైనప్పటికీ జాప్యం చేస్తున్నారని, ఈ జాప్యానికి కారణాలు తెలియడం లేదని అంటున్నారు.