ఎన్నికల వేళ ప్రచార యాత్ర పై జగన్ కీలక నిర్ణయం...!!
ముఖ్యమంత్రి జగన్ పై దాడి రాష్ట్రంలో కలకలం రేపింది. దాడి తరువాత బస్సు యాత్రకు ఒక్క రోజు విరామం ఇచ్చిన జగన్ తిరిగి తన యాత్ర ప్రారంభించారు. గన్నవరం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర ఈ సాయంత్రం భీమవరంకు చేరుకుంటుంది. జగన్ పైన దాడి తరువాత భద్రతలో భాగంగా అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యాత్ర షెడ్యూల్ పైన స్పష్టత వచ్చింది.
కీలక మార్పులు
విజయవాడలో జగన్ పైన దాడి తరువాత భద్రతా పరంగా కొన్ని కీలక మార్పులు చేసారు. దాడి ఘటన పైన నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం పోలీసు అధికారులను ఆదేశించింది. అదే సమయంలో దాడి ఘటన పైన విచారణ కొనసాగుతోంది. 20 మంది అధికారులతో ఆరు టీంలను ఏర్పాటు చేసారు. స్థానికంగా వివేకానంద స్కూల్ నుంచి దాడి జరిగినట్లు ప్రాధమికంగా నిర్ణయించారు. ఈ దాడి తరువాత భద్రతా పరంగా పోలీసు ఉన్నతాధికారులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బస్సు యాత్ర ముందు 100 మీటర్ల వరకు రోప్ పార్టీని ఏర్పాటు చేసారు. డేగ కన్నుతో ప్రత్యేక సిబ్బంది పరిసరాలను పరిశీలిస్తున్నారు. యాత్ర గన్నవరం నుంచి ప్రారంభమైన సమయం నుంచి భద్రతా సిబ్బంది ప్రతీ అడుగులోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఆంక్షల పై క్లారిటీ
దాడి తరువాత ప్రజలను కలవటంతో ఆంక్షలు విధించాలని అధికారులు భావించారు. కానీ, జగన్ అందకు అంగీకరించలేదు. జనంతో కలవటం, వారి సమస్యలు తెలుసుకోవటం కొనసాగించాలని నిర్ణయించారు. ఈ రోజు జరిగిన యాత్రలోనూ బస్సు మెట్ల పై కూర్చొని తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బస్సు పైకి వచ్చి అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక, దాడి తరువాత యాత్రలో మార్పుల గురించి జగన్ ప్రోగ్రామ్స్ పర్యవేక్షణ చేసే ఎమ్మెల్సీ తలశిల రఘురాం స్పష్టత ఇచ్చారు. ప్రజలను కలవటం ఎలాంటి ఆంక్షలు లేవని తేల్చి చెప్పారు. గజమాలలు, పూలు విసరటం మాత్రం నిలిపివేయాలని సూచించారు.

24 వరకు బస్సు యాత్ర
2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలోనూ రాళ్లు వేసారని తలశిల వెల్లడించారు. విజయవాడలో వచ్చిన జన స్పందనతో ప్రత్యర్ది పార్టీలు భరించలేక దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. యాత్ర పైన కొత్తగా ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. భద్రతా పరంగా అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని వివరించారు. యాత్ర గతంలో ఎలా జరిగిందో అదే విధంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 24వతేదీ వరకు బస్సు యాత్ర జరుగుతుందని వెల్లడించారు. 25న పులివెందులలో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేలా రోజుకు మూడు నియోకవర్గాలను కవర్ చేసేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications