తమిళ మహిళపై గ్యాంగ్ రేప్: యువతి సజీవదహనం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ముగ్గురు కామాంధులు దారుణానికి ఒడిగట్టారు. చిత్తుకాగితాలు ఏరుకునే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అపస్మారక స్థితికి చేరుకుంది. తమిళనాడు ప్రాంతం నుంచి ఓ యువతి ఇటీవల నిడుబ్రోలు పట్టణానికి చేరుకుంది. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తోంది.
గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో ఆ యువతి పెద్దగా కేకలు వేస్తూ రక్షించాలని వేడుకుంది. స్థానిక మహిళలు ఆ యువతిని రక్షించారు. అప్పటికే కొందరు దుండగులు ఆమెను తీవ్రంగా హింసించినట్టు తెలిసింది. ఆ యువతిపై అత్యాచారం జరిగిందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనలో కె.మాణిక్యరావు, ఏ.ఏసుబాబు అనే ఇదరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో వ్యక్తి పారిపోయాడని సమాచారం. తెల్లవారుజామున రెండు గంటలకు ఈ దారుణం చోటు చేసుకున్నా బాధితురాలిని ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు నిర్లక్ష్యం వహించారనే విమర్శలు వచ్చాయి. మీడియాలో కథనాలతో స్పందించిన ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ మాల్యాద్రి బాధితురాలిని నిడుబ్రోలు ప్రభుత్వాసుపత్రికి హుటాహుటిన తరలించారు.
గుంటూరు జిల్లాలోని గురజాలలో అనుమానాస్పద స్థితిలో యువతి లక్ష్మీనర్సమ్మ సజీవ దహనమైంది. తమ కూతురు గత రాత్రి నుంచి కన్పించకుండా పోయిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంటి ముందే యువతి సజీవ దహనం కావడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గురజాల పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.