అమెరికాలో ఘోర కారు ప్రమాదం-తానా బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కూతుళ్ల దుర్మరణం...
అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణిశ్రీ, ఆయన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అమెరికాలోని తెలుగు వారిలో తీవ్ర విషాదం నింపింది.
ఏపీలోని కృష్ణాజిల్లా కురుమద్దాలికి చెందిన నాగేంద్ర శ్రీనివాస్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు 1995లో అమెరికా వెళ్లారు. అనంతరం పీడియాట్రిక్ కార్డియోవాస్క్యులర్ అనస్థీషియాలజిస్ట్గా పనిచేస్తూ హ్యూస్టన్లో స్థిరపడ్డారు. 2017 నుంచి ఆయన 'తానా' బోర్డులో పనిచేస్తున్నారు. శ్రీనివాస్ భార్య వాణి ఆదివారం ఉదయం 11.30 గంటలకు కాలేజీ నుంచి కుమార్తెలను తీసుకొచ్చేందుకు కారులో వెళ్లారు. తిరుగుప్రయాణంలో ఆమె ప్రయాణిస్తున్నకారును... టెక్సాస్ వాలర్ కౌంటీలో ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ప్రాణాలు కోల్పోయారు. వాణితో పాటు ఆమె కుమార్తె అక్కడికక్కడే చనిపోయాగ.. మరో కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాణి ఐటీ ఉద్యోగి కాగా, పెద్ద కుమార్తె వైద్య విద్యను అభ్యసిస్తోంది.
రెండో అమ్మాయి 11వ తరగతి చదువుతోంది. ప్రమాదంలో భార్య, ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన శ్రీనివాస్ షాక్లోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన తానా సభ్యులు, సన్నిహితులు కూడా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.