బెంగళూరు ఆసుపత్రిలో మంచు మనోజ్- తారక్ ఫ్యామిలీతో
తీవ్ర గుండెపోటుతో బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న త్వరలోనే కోలుకుంటాడని నటుడు మంచు మనోజ్ అన్నారు. ఇవ్వాళ ఆయన బెంగళూరుకు వచ్చారు.
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురైన నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పంలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను బెంగళూరు నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో అత్యాధునిక చికిత్సను అందిస్తోన్నారు.
నందమూరి కుటుంబం మొత్తం ప్రస్తుతం నారాయణ హృదయాలయా ఆసుపత్రిలోనే ఉంటోన్నారు. తారకరత్న తండ్రి మోహన కృష్ణ, బాబాయ్ బాలకృష్ణ, వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. తారక్ కు అందుతోన్న వైద్య సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. ఆయనను చూడ్డానికి హైదరాబాద్ నుంచి పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు బెంగళూరుకు వస్తోన్నారు. ప్రముఖ నటులు, తారకరత్న సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఇవ్వాళ బెంగళూరుకు చేరుకున్నారు.
తాజాగా మంచు మనోజ్ నారాయణ హృదయాలయాకు వచ్చారు. తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారక్ ను చూశారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తమ ముందుకు వస్తాడని అన్నారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూశానని, ఆయన కోలుకుంటోన్నారంటూ అప్ డేట్ ఇచ్చారు.
visited #Tarakratna and am filled with hope and optimism for his future. He has our unwavering support and I'm sure with the grace of God and all the prayers of the people who care for him, he will make a full recovery soon and be back home with us. Love u babai 🙏🏼❤️
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 29, 2023
ఆయనకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నానని చెప్పారు. తారకరత్నను చూసిన తరువాత భవిష్యత్తు పట్ల తనకు భరోసా లభించిందని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తాడనే ఆశ కలిగిందని అన్నారు. తారకరత్న, ఆయన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉన్నారని, దేవుని దయతో మళ్లీ మన ముందుకు వస్తాడని పేర్కొన్నారు. త్వరలో పూర్తిగా కోలుకుని ఇంటికి తిరిగి వస్తాడని అంటూ ట్వీట్ చేశారు. లవ్ యు బాబయ్ అంటూ ట్వీట్ ను ముగించారు.