ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు మార్క్ రాజకీయం..!!
Chandra Babu:టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు రాజకీయ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏ అవకాశం వచ్చినా వదులుకోవటం లేదు. అటు ప్రధాని మోదీ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ప్రత్యేకంగా తన విజన్ బయట పెట్టారు. ఆ సమావేశం తరువాత పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. పాత మిత్రులతోనూ భేటీ అవుతున్నారు. ఇదే క్రమంలో రాజకీయంగానూ ఢిల్లీ కేంద్రంగా కొత్త లెక్కలు మొదలు పెట్టారు.
ప్రధాని ముందు విజన్ - ఆమోదం
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు. జీ20 సమావేశం నిర్వహణ అజెండాలో తన సూచనగా విజన్ 2047 గురించి వివరించారు. యువ మేధస్సుతో ప్రపంచ శక్తిగా భారత్ ఎదుగుతోందని వివరించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్ నెంబర్ ఒన్ దేశంగా ఎదుగుతుందని అంచనా వేసారు. 2047 తరువాత వయోభారం సమస్య ఏర్పడుతుందని.. డెమోగ్రాఫిక్ మేనేజ్ మెంట్ తో ఎదుర్కోవాలని సూచించారు. ప్రధాని తన ప్రసంగంలోనూ చంద్రబాబు ప్రతిపాదించిన అంశాన్ని ప్రస్తావించారు. ఇదే అంశం పైన చంద్రబాబుతో చర్చించాని నీతి అయోగ్ కు ప్రధాని సూచించారు. దీంతో మర్నాడే నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ పరమేశ్వరన్ అయ్యర్ ఢిల్లీలో టీడీపీ ఎంపీ గల్లా నివాసంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు.
చంద్రబాబు వద్దకు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్
ప్రధాని సూచన మేరకు చంద్రబాబు వద్దకు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ స్వయంగా వచ్చి భేటీ అయ్యారు. నీతి అయోగ్ ప్రధాని అధ్యక్షతన పని చేస్తుంది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశ వ్యాప్తంగా కీలక నిర్ణయాల్లో నీతి అయోగ్ పాత్ర కీలకంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు సూచనల స్వీకరణకు స్వయంగా నీతి అయోగ్ వైస్ ను ఛైర్మన్ ను ప్రధాని పంపటం తమ అధినేతకు దక్కిన గౌరవంగా టీడీపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక..ప్రధానితో రాజకీయంగా మాత్రం చంద్రబాబుకు ఈ పర్యటనలో ప్రయోజనం కలగలేదు. ఈ సమావేశం తరువాత ప్రధాని - అమిత్ షా తో భేటీ కావాలని చంద్రబాబు ప్రయత్నించారు. దీంతో, ఈ నెలాఖరులో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాత మిత్రులతో భేటీలు ఆరంభం..
ఇటు బీజేపీతో సత్సంబంధాలు కోరుకుంటున్న సమయంలోనే..పాత మిత్రులతోనూ చంద్రబాబు భేటీ అవుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో విభేదించిన చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒకే తాటి పైకి తెచ్చే ప్రయత్నం చేసారు. కానీ, కేంద్రంలో మరోసారి మోదీ అధికారంలోకి రావటంతో పాటుగా ఏపీలీ టీడీపీ అధికారం కోల్పోయింది. ఇదే ఫరూక్ అబ్దుల్లా 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేసారు. బీజేపీ నేతలు పదే పదే టీడీపీతో పొత్తు ఉండదని చెబుతున్న క్రమంలోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఈ భేటీ నిర్వహించినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. పవన్ కల్యాణ్ తో పొత్తు విషయంలో మాత్రం టీడీపీ ధీమాగా కనిపిస్తోంది. ఒక వైపు బీజేపీతో సఖ్యత కోరుకుంటూనే..మరో వైపు తన వ్యూహాలతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.