అమరావతి ఉద్యమంపై సినిమా : సెట్స్ పై హీరో - హీరోయిన్లు : టార్గెట్ జగన్ సర్కార్..!!
అమరావతి ఉద్యమ ప్రస్థానం తెరకెక్కనుంది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన మొదలు..తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు వరకు వరుసగా చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరిస్తున్నారు. అమరావతికి మద్దతుగా పోరాటం చేసిన ఐక్యకార్యాచరణ సమితి సహకారంతో ఈ సినిమా సిద్దం అవుతోంది. నిర్మాత రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
కథానాయకుడు నిఖిల్, సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్లపై ఉద్యమ సన్నివేశాలను దర్శకుడు నరేంద్ర చిత్రీకరించారు. సహాయనటులుగా ఉద్యమంలో పాల్గొన్న మహిళలను తీసుకున్నారు. అమరావతి ఉద్యమం ప్రారంభం నుంచి న్యాయస్థానంలో కేసు గెలిచేంత వరకు జరిగిన పరిణామాలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా సినిమా ప్లాన్ చేసారు.
రాష్ట్ర ప్రజల కోసమే అంటూ
కాగా, తాజాగా తుళ్లూరు హైస్కూల్ లో జరిగిన షూటింగ్ లో రైతులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లో ఉంచిన ఘట్టాలను చిత్రీకరించారు. రైతులను అరెస్ట్ చేయటంతో..నిరసనగా అమరావతి ప్రాంత వాసులు స్టేషన్ వద్దకు వచ్చి ధర్నా చేసే సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభించారదు. అమరావతి మహిళ పాత్రలో వాణీ విశ్వనాద్ డైలాగ్స్ చెప్పే సీన్ షూటింగ్ పూర్తి చేసారు.
నాడు స్వతంత్ర పోరాటంలో అయిన వారంతా దారుణంగా చని పోతున్నా.. ప్రజలంతా వందేమాతరం అన్నారే తప్పా.. నా వాళ్లు..నా అక్క.. నా అన్న అన్నదే లేదు. అదే మా సంస్కృతి..అదే మాకు స్పూర్తి.. మా ఉద్యమం మా మొగుళ్ల కోసం కాదు..రాష్ట్ర ప్రజల అందరి కోసం అంటూ వాణీ విశ్వనాధ్ తో డైలాగ్ చెప్పించారు.
జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా
ఉద్యమం ప్రారంభ సమయం నుంచి రైతులు ఎటువంటి పోరాటాలు చేసారు.. ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు... న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర.. కోర్టు తీర్పు వరకు అన్నీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా.. అమరావతి రైతులకు జరిగే నష్టం వివరించేలా ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా రాజకీయ పార్టీల మద్దతు.. ప్రభుత్వ వైఖరి..ఇతర ప్రాంతాల నుంచీ అమరావతి రైతులకు లభిస్తున్న మద్దతు వంటి అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే నగరి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న వాణీ విశ్వనాద్ ను ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ఎంపిక చేసారు.
రాజకీయంగా ప్రభావం ఉంటుందా
వాణీ విశ్వనాద్ గతంలోనే నగరి నుంచి రోజా పైన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగినా..అక్కడ సీనియర్ నేత గాలి ముద్దుక్రిష్ణమ నాయుడు కుటుంబాన్ని కాదని మరొకరికి ఇచ్చే అవకాశం లేదు. దీంతో.. ఈ సారి వాణీ విశ్వనాద్ జనసేన అభ్యర్ధిగా నగరి నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పుడు అమరావతి ఉద్యమం పైన చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ వంటి వారి గురించి ఏం చెప్పబోతున్నారు.. ఎలా చూపిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
అయితే, అమరావతికి జగన్ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తుందనే సందేశం మాత్రం ఈ సినిమా ద్వారా ఇస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో.. ఇప్పుడు ఈ సినిమా గురించి సినీ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తి కరంగా మారుతోంది.