టార్గెట్ జగన్ - 2024 చంద్రబాబు కూటమి ఫైనల్ : బీజేపీ తేల్చేసింది- టీడీపీ నేత సంచలనం...!!
ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. సీఎం జగన్ లక్ష్యంగా నూతన పొత్తుల దిశగా కసరత్తు జరుగుతోంది. 2024 ఎన్నికల్లో టార్గెట్ జగన్ నినాదంతో ప్రతిపక్ష పార్టీల కూటమికి రంగం సిద్దం అవుతోంది. 2024 ఎన్నికలు అటు వైసీపీ..ఇటు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు జగన్.. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో జగన్ సింగిల్ గానే పోటీ చేసారు. టీడీపీ ఆ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకొని..జనసేన మద్దతు తీసుకుంది.

కొత్త పొత్తుల దిశగా అడుగులు
ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ..టీడీపీ సింగిల్ గానే పోటీ చేసాయి. ఫలితంగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక, వచ్చే ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష ఓటు చీలకుండా.. తమ టార్గెట్ సాధించే పనిలో చంద్రబాబు కొత్త పొత్తుల దిశగా ఇప్పటికే అంతా సెట్ చేసేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు తమ పార్టీ ఎవరితో కలిసి పోటీ చేస్తుందో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వెల్లడించారు. వైసీపీని ఓడించేందుకు 2024 ఎన్నికల్లో టీడీపీ ..జనసేన..వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయంటూ శాసనమండలి మాజీ ఛైర్మన్.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ అహ్మద్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

టీడీపీ ముఖ్య నేత కీలక వ్యాఖ్యలు
కొంత కాలంగా టీడీపీ - జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. టీడీపీ మాజీ మంత్రులు ఓపెన్ గానే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అనధికారి కంగా టీడీపీ - జనసేన నేతలు క్షేత్ర స్థాయిలో పొత్తులతో కొన్ని స్థానాలు దక్కించుకున్నారు. అయితే, బీజేపీతోనూ సఖ్యత కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ, బీజేపీ నుంచి మాత్రం సానుకూల సంకేతాలు రాలేదుద. దీంతో..బీజేపీ - వైసీపీ మధ్య సత్సంబంధాలకు చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. 2019 ఎన్నికల ముందు జగన్ టీడీపీ - బీజేపీ మధ్య సంబంధాలను దెబ్బ తీసేలా వ్యవహరించి అందులో సక్సెస్ అయ్యారు.

బీజేపీతో పొత్తు ఉన్నా..లేకున్నా
జగన్ ట్రాప్ లో నాడు చిక్కుకున్న చంద్రబాబు... ఒక దశలో ప్రధాని పైన వ్యక్తిగత వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు టీడీపీ అదే రకంగా బీజేపీ - వైసీపీ సంబంధాలు దెబ్బ తీసి.. తిరిగి బీజేపీతో కలిసి పని చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి కేంద్రం..బీజేపీ పైన టీడీపీ ఎటువంటి విమర్శలు చేయలేదు. అయితే, తాజాగా వైసీపీతో గ్యాప్ పెంచేలా చేసే క్రమంలో ఏపీలో బీజేపీ సభ ముందు మాత్రం టీడీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో బీజేపీ భారతీయ జగన్ పార్టీలా పని చేస్తుందనే వ్యాఖ్యలు మొదలు పెట్టారు. బీజేపీ తో ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నా 2014 తరహాలో లాభం జరగదనే భావనలో టీడీపీ ముఖ్య నాయకత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది.

టార్గెట్ జగన్ గా చంద్రబాబు వ్యూహాలు
బీజేపీ బలహీన పడిందని..ఏపీలో ఆ పొత్తు లేకున్నా.. నష్టం ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల సమయం వరకు వేచి చూడాలని..అప్పటి వరకు బీజేపీ పైన రాజకీయంగా వైరం వద్దని నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో..జనసేన - వామపక్షాల తో పొత్తుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే..వామపక్షాలు టీడీపీ - జనసేనకు దూరం అవుతాయి. అదే విధంగా జనసేన టీడీపీ నేతలు ఆశిస్తున్నట్లుగా పొత్తు పెట్టుకోవాలంటే..అటు బీజేపీకి జనసేన దూరం కావాలి. లేదా టీడీపీ వామపక్షాలకు దూరమై..ఇటు జనసేన - వామపక్షాలతో పొత్తు కొనసాగించాలి.

జగన్ వర్సెస్ చంద్రబాబు 2024 వార్ బిగిన్
అయితే, ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబు వ్యూహాలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు వైసీపీ అధినేత జగన్ మాత్రం సింగిల్ గా ఫైట్ చేసేందుకే తొలి నుంచి మొగ్గు చూపుతున్నారు. ఈ సారి ఎన్నికల్లోనూ వైసీపీ సింగిల్ గానే పోటీ చేయనుంది. ఇక, బీజేపీ తో కూడిన చంద్రబాబు కూటమి..లేక, బీజేపీ రహిత చంద్రబాబు కూటమా అనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది. అయితే..టీడీపీ - జనసేన కలవటం మాత్రం ఖాయమనే అంశం ఇప్పుడు ఏకంగా పొలిట్ బ్యూరో సభ్యుడే చెప్పటం తో ఖరారైనట్లేననే చర్చ మొదలైంది. ఏపీలో రానున్న ఎన్నికల దిశగా అప్పుడే రాజకీయ వ్యూహాలు..అడుగులు మొదలు కావటంతో రాజకీయంగా చోటు చేసుకొనే పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications