సభలో 'టి' ట్విస్ట్: ఇరుకునపడ్డ జగన్ ఏకాకి, ఒత్తిడి
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు అంశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏకాకి అయిపోయింది! బిల్లు పైన అసెంబ్లీలో చర్చించాల్సిందేనని ప్రాంతాలకతీతంగా అన్ని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. వైయస్సార్ పార్టీ మాత్రం పట్టు విడువడం లేదు. బిల్లు రాష్ట్రానికి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రాంతాలవారీగా బిల్లు పైన చర్చపైన, చర్చ ప్రారంభం అంశం పైన మాటల యుద్ధం సాగింది.
అయితే, ఈ నెల 23వ తేదీన బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపించాల్సిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చర్చకు మొగ్గు చూపుతున్నారు. సభలో చర్చ జరగకున్నా కేంద్రం పార్లమెంటులో బిల్లును పెట్టేందుకు సిద్దమవుతోంది. బిల్లు పెట్టకుండా తమ ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ చర్చ జరిపి, అభ్యంతరాలు చెప్పడం అని సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో వారు చర్చ జరిపి... బిల్లు అసంపూర్ణంగా ఉందని, చాలా అభ్యంతరాలు ఉన్నాయని విన్నవిస్తే అప్పుడు రాష్ట్రపతి, కేంద్రం పునరాలోచనలో పడతాయని అంటున్నారు. ఇందుకోసమైనా చర్చ జరగాల్సిందేనని చెబుతున్నారు.
మొదట చర్చకు మొగ్గు చూపని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శైలజానాథ్ వంటి నేతలు కూడా ఇప్పుడు చర్చకు పట్టుబడుతున్నారు. చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని రెండు రోజులుగా కిరణ్ చెబుతున్నారు. చర్చకు మొదట నో చెప్పిన మంత్రులు, కాంగ్రెసు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఇప్పుడు చర్చించాలంటున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం కూడా పూర్తి సమాచారం పెడితే చర్చకు సిద్ధమని ప్రకటించింది.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం చర్చకు సుముఖంగా లేదు. చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లే అవుతుందనేది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదన. సమైక్య తీర్మానం చేస్తే తాము చర్చకు సహకరిస్తామని ప్రకటించింది. అయితే, బిల్లు సభకు వచ్చిన తర్వాత సమైక్య తీర్మానం చేయడం కుదరదని చెబుతున్నారు. చర్చకు సహకరించకుంటే జగన్ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. తద్వారా జగన్ పార్టీ పైన ఒత్తిడి పెంచుతున్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ మొదటి నుండి చర్చ కోరుతున్నారు. ఇప్పుడు సీమాంధ్ర కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కూడా సై అంటున్నాయి. ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు కూడా సభలో బిల్లు పైన చర్చించాలని, అప్పుడే అభ్యంతరాలు చెప్పేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు. చర్చలో పాల్గొనకుంటే ఉద్యోగులం ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.