జగన్కు షాక్ మీద షాక్, ఇలాకాలో చెక్: పులివెందులపై బాబు 'డబుల్' ప్లాన్!
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి 'పులివెందుల' షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు.
అమరావతి/కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి 'పులివెందుల' షాక్ తగలనుందా? అంటే అవుననే అంటున్నారు. నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆ నియోజకవర్గం రెండుగా చీలుతుందని, అప్పుడు జగన్కు షాక్ తగలడం ఖాయమంటున్నారు.
జగన్ ఇలా చెయ్, నువ్వు మారకుంటే లోకేష్ ముఖ్యమంత్రి: రాయపాటి
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం వద్ద పట్టుబడుతున్నాయి. ఇటీవల కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. 2026 నాటికి నియోజకవర్గాల పెంపు ఉంటుందని సభలో కేంద్రమంత్రి చెప్పినప్పటికీ, 2019 నాటికి పెరగవచ్చునని, చర్చలు జరుగుతున్నాయని వెంకయ్య నాయుడు చెప్పారు.
ఇప్పటికే కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందారు. పలువురు నేతలు టిడిపిలో చేరుతున్నారు. ఇప్పుడు జగన్ను దెబ్బతీసేందుకు టిడిపి నియోజకవర్గాల పునర్విభజనను ఉపయోగించుకోవచ్చునని అంటున్నారు.

వైయస్ జగన్ హవాకు చెక్ పడినట్లేనా
మొత్తానికి ఏపీ, తెలంగాణలలో పునర్విభజన అంశంపై కేంద్రం దృష్టి సారించింది. ముఖ్యంగా వైయస్ జగన్ నియోజకవర్గమైన పులివెందుల వంటిని టార్గెట్ చేసుకుంటున్నట్లుగా కూడా కనిపిస్తోందని అంటున్నారు. ఇక్కడ జగన్కు, వైయస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీంతో ఇక్కడ వైసిపి హవా కనిపిస్తోంది.

మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేపు పులివెందుల
అయితే, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 34 ఏళ్ల తర్వాత టిడిపి.. వైయస్ ఇలాకాలో సత్తా చాటింది. ఈ గెలుపు ద్వారా జగన్కు టిడిపి గట్టి షాక్ ఇచ్చింది. తద్వారా సొంత నియోజకవర్గంలోనే జగన్ ఇమేజ్ తగ్గుతోందని టిడిపి చెబుతోంది. ఇప్పుడు ఏకంగా ఆయన నియోజకవర్గం రెండు ముక్కలు అయితే.. అది వైసిపికి నష్టం కలిగిస్తుందని అంటున్నారు.

పెంపులో పులివెందుల టార్గెట్
2019లో నియోజకవర్గాల పెంపు జరిగితే.. పులివెందుల రెండుగా అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అదే జరిగితే సొంత నియోజకవర్గంలో జగన్ హవాకు చెక్ పడినట్లేనని భావిస్తున్నారు. ప్రధానంగా జగన్ను టార్గెట్ చేసిన టిడిపి.. పులివెందుల రెండుగా చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుందంటున్నారు.

విభజన తర్వాత..
విభజన అనంతరం ఏపీలో 175, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీలో 225 సీట్లకు, తెలంగాణలో 153 సీట్లకు నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు చేస్తామని కేంద్రం ఇరు రాష్ట్రాలకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

దీనిని ఉపయోగించుకొని జగన్ను అడ్డుకోవాలని..
ప్రస్తుతం కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ మరో మూడు నియోజకవర్గాలు పెరగాల్సి ఉందని అంటున్నారు. నియోజకవర్గాల పెంపును ఆసరాగా తీసుకొని కడప జిల్లాలో జగన్కు చెక్ చెప్పాలని టిడిపి భావిస్తోంది. కడప జిల్లాలో వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించింది. కడపలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో వైసిపికి గట్టి బలం ఉంది.
పులివెందుల నియోజకవర్గం నుంచి రెండు మండలాలు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరికొన్ని మండలాలతో ఓ కొత్త నియోజకవర్గం రానుందని తెలుస్తోంది.

అధికార దుర్వినియోగం
నియోజకవర్గాల పునర్విభజన విషయంలో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడే అవకాశముందని, అధికారులపై ఒత్తిడి తెచ్చి, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలుచుకునే అవకాశాలు లేకపోలేదని కడప జిల్లా వైసిపి నేత ఒకరు అభిప్రాయపడ్డారు. కడప, కర్నూలు జిల్లాల నుంచి ఇప్పటికే టిడిపి పలువురు ప్రజాప్రతినిధులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందని, ఆయా పరిస్థితులను బట్టి ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను లేదా సీనియర్ టిడిపి నేతలను బరిలోకి దించుతారని అంటున్నారు.












Click it and Unblock the Notifications