జగన్ ఫొటోపై టీడీఎల్పీ లిక్కరాభిషేకం-జే బ్రాండ్ లిక్కర్ పోసి నిరసన
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మద్యం బ్రాండ్ల వ్యవహారంలో కొనసాగుతున్న పోరు తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో జే బ్రాండ్ లిక్కర్ వల్లే మరణాలు పెరుగుతున్నాయంటూ టీడీపీ ఆరోపిస్తుండగా.. చంద్రబాబు హయాంలో ఉన్న బ్రాండ్లను వైసీపీ విడుదల చేసింది. నిన్న తాజాగా అధికారులు వైసీపీ హయాంలో 20 కొత్త బ్రాండ్లు మాత్రమే వచ్చాయంటూ వివరాలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా ఏపీ అసెంబ్లీలో మద్యం రచ్చ కొనసాగింది.
ఏపీలో మద్యం బ్రాండ్లపై టీడీపీ ఎమ్మెల్యేలు ఇవాళ ఏపీ అసెంబ్లీలో తీవ్ర నిరసన తెలిపారు. దీంతో సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారనే కారణంతో వారిని స్పీకర్ ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం అసెంబ్లీ బయటికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. జే బ్రాండ్ మద్యంపై తమ నిరసన తెలిపారు. స్వయానా సీఎం జగన్ చిత్రపటం పెట్టి దానిపై జే బ్రాండ్ మద్యం పోశారు. మద్యాభిషేకం చేసి విన్నూత్నంగా నిరసన తెలిపారు.
మద్యనిషేధం హామీ మరిచి...సారా, జె బ్రాండ్ తోల మహిళల తాళిబొట్లు తెంచేస్తోన్న సారా సీఎం రాజీనామా చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మహిళలకి ఇచ్చిన మాట తప్పిన సీఎం చిత్రపటంపై జె బ్రాండ్ మద్యం పోసి నిరసన తెలిపారు. (1/2)#YSRCPNatuSaraMafia pic.twitter.com/92Yv0mmNQu
— Telugu Desam Party (@JaiTDP) March 21, 2022
అసెంబ్లీలో ఎమ్మెల్యేల సస్పెన్షన్ తర్వాత బయటికి వచ్చిన టీడీపీ శాసనసభా పక్ష నేతలంతా కలిసి సీఎం జగన్ ఫోటో పెట్టి దానిపై జే బ్రాండ్ మద్యం పోశారు. ప్రభుత్వ మద్యం బ్రాండ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో ఎమ్మెల్సీ లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో తాజాగా కల్తీ సారా మరణాల నేపథ్యంలో టీడీపీ జే బ్రాండ్ మద్యం అంటూ నిరసనలకు దిగుతోంది. దీనిపై ప్రభుత్వం సభలో ఎన్ని వివరణలు ఇస్తున్నా టీడీపీ నేతలు మాత్రం శాంతించడం లేదు. నిత్యం అసెంబ్లీలో రచ్చకు దిగడం ద్వారా సస్పెండ్ అవుతున్నారు. ఇవాళ కూడా అదే తంతు కొనసాగింది.