వైసిపి అంటే టిడిపికి భయం : ఆ పార్టీకి జనసేనే కరెక్ట్: ఓపెన్గానే పొత్తు పెట్టుకుంటాం : పవన్.
జనసేన అధినేత పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. మదనపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా టిడిపి..వైసిపి పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో వ్యక్తిగతంగా జగన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ.. వామపక్షాల తో కలిసి జనసేన పోటీ చేస్తుందని..అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసారు.
వైసిపి అంటే టిడిపికి భయం..
వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందని.. వైసీపీకి సరైన పార్టీ జనసేనేనని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. కేసీఆర్ సైకిల్ చైన్ తెంపేశారని, సైకిల్ పాతబడిపోయిందని పవన్ ఎద్దేవా చేశారు. శాసనసభకే వెళ్లని ప్రతిపక్షనేత రాష్ట్రానికి అవస రమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేస్తోందని తెలిపారు. ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగానే ప్రకటిస్తాను కానీ జగన్లా మోదీ కాళ్లు పట్టుకోనని మండిపడ్డారు. ఏపి లో ఆ రెండు కుటుంబాలకే రాజకీయాలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా విఫలమైన జగన్ ముఖ్యమంత్రి అయి ఏం చేస్తారని ప్రశ్నించారు. వైకాపా వారు బీసీల సభలు పెట్టడం కాదు.. ఎంతమంది బీసీలకు టిక్కెట్లిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
నేరుగా మద్దతిస్తాను..
టీడీపీకి మద్దతిస్తే నేరుగా మద్దతిస్తానే తప్ప.. మీలా భయపడి దొడ్డి దారిలో ఇవ్వనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. 2014 లోనూ టీడీపీకి నేరుగానే తన మద్దతిచ్చానని తెలిపారు. మీలా భయపడి దొడ్డి దారిలో బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు కోసం చూడలేదని జగన్ని విమర్శించారు. మార్పునకే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఇది 2009 కాదని, ప్రజారాజ్యంలా ఉండదని, 2019 అని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తెరాస, భాజపా కలిసి వైకాపా అయ్యిందని వివరించారు. రాష్ట్రంలో హోదా కోసం గొంతెత్తిన ఏకైక రాజకీయ పార్టీ నాయకుడిని తానే నని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పిస్తామన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి పేద రైతుకు నెలకు రూ.5 వేల పింఛను అందిస్తామని, పేద రైతులకు ఏటా రూ.8 వేల సాగుసాయం అందిస్తామని హామీలిచ్చారు.
ఆ బాధ్యతలు అక్కడి వారికే..
పవన్ కళ్యాన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం..విశాఖ లోని గాజువాక నుండి పవన్ బరిలో ఉన్నారు. అయితే, ఆ రెండు స్థానాల్లో కంటే ముందుగా పార్టీ అభ్యర్దుల గెలుపు కోసం పవన్ కళ్యా ణ్ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పవన్ పర్యటన పూర్తయింది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పవన్ పర్య టన కొనసాగుతోంది. గాజువాక లో పార్టీ సమన్వయం..ప్రచార బాధ్యతలను మాజీ జెడి లక్ష్మీనారాయన కు అప్పగించా రు పవన్. ఇక, భీమవరంలో బాధ్యతలను నర్సాపురం ఎంపీగా బరిలో ఉన్న నాగబాబు పర్యవేక్షిస్తున్నారు. చివరి రెండు రోజుల పర్యటన పూర్తిగా నర్సాపురం..విశాఖ లోక్సభ పరిధిలో ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.