భారీ ట్విస్ట్: TDP, BRS పొత్తు పెట్టుకుంటాయా?
TDP, BRS: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు గడువు ఏడాదిన్నర ఉంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చంటూ తమ శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ఒక అడుగు ముందుకువేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ ఏపీలోను అడుగు పెడుతోంది.

టీడీపీ నేతలతో తలసానికి బంధుత్వం
ఏపీలో బీఆర్ఎస్ బాధ్యతలు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షించనున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్ తో బంధుత్వం ఉండటంతో ఆ దిశగా కూడా తలసాని ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు వీరి సహాయ సహకారాలను కోరుతున్నారు. ఉప్పు-నిప్పులా ఉండే తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి ఏపీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇద్దరు చంద్రుల మధ్య భగ్గుమంటున్న రాజకీయం
చిరకాల ప్రత్యర్థులుగా కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో పోరాటం చేస్తున్న నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. టీడీపీని తెలంగాణలో నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు, ఉద్యమ సమయంలో ఆంధ్రుల గురించి చేసిన ఎగతాళి, వివాదాస్పద వ్యాఖ్యలు తదితరాలన్నింటినీ గుర్తుంచుకున్న ఆంధ్రులు కేసీఆర్ ను ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారకుడిగా భావిస్తాయి. ఆ పార్టీకానీ, ఆయనకానీ చేసిన వ్యాఖ్యలు, మాట్లాడినవి అన్నీ గుర్తుపెట్టుకున్నారు. ఇటువంటి తరుణంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంటూ ఊహాజనితమైన వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మోడీ రోడ్ మ్యాప్ తర్వాత మారిన చంద్రబాబు ఆలోచన
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో యాక్టివ్ అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని ఈనెల 21న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తుండటంతోపాటు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. పార్టీలోని సీనియర్లందరినీ మరోసారి ఆహ్వానించబోతున్నారు. కార్యకర్తల బలం ఎక్కువగా ఉండటంతో బలమైన నాయకులను చేరదీసి రానున్న ఎన్నికల్లో తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశాఖపట్నం తర్వాత పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు రావడం, తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రకటనలివ్వడం చూసిన తర్వాత సొంతంగా బరిలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. పలువురు టీడీపీ నేతలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో రెండు పార్టీలు పొత్తు పెట్టుకునేదాన్ని గురించి టీడీపీకి చెందిన కీలక నేత అవకాశాలుండొచ్చు అంటూ వ్యాఖ్యానించారు.

ఇక్కడి ప్రజలు ఎలా స్పందిస్తారో?
ఆంధ్రా పాలకుల గురించి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఆంధ్రుల చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతుంటాయి. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకునే సాహసం చేయకపోవచ్చు అంటున్నారు. ఏపీలో అడుగుపెట్టే ముందుకు ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పి అడుగు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో టీడీపీ బలోపేతమవుతున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోను టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని బీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏదేని ఒక స్పష్టత వచ్చేవరకు ఈ తరహా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications