ముద్రగడ కాపు గర్జన: జగన్ను దుమ్మెత్తిపోస్తున్న టిడిపి
విజయవాడ: మాజీ మంత్రి ముద్రడ పద్మనాభం రేపు ఆదివారం తలపెట్టిన కాపు గర్జన సభపై తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోస్తున్నారు. జగన్పై ఉప ముఖ్యమంత్రి చిన్నరాజప్ప, టిడిపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావు, నాయకుడు రామాంజనేయులు తీవ్ర వ్యాఖ్యలుచేశారు.
కాపు సభలూ సమావేశాలు ఇప్పుడు అవసరం లేదని చినరాజప్ప అన్నారు. కాపుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. కాపులను బీసీల్లో కలుపుతామనే హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే కమిషన్ వేశామని చెప్పారు. రాజకీయ స్వార్తంతోనే జగన్ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని కళా వెంకటరావు విమర్శించారు. కాపులను బీసీల్లో కలుపుతామనే హామీకి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కాపుల కోసం వైయస్ రాజశేఖర రెడ్డి ఏం చేశారో చెప్పాలని ఆయన అడిగారు.
ముద్రగడను అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకం ఆడుతోందని ఆయన అన్నారు. కాపులను రెచ్చగొట్టడానికి వైసిపి నాటకమాడుతోందని ఆయన అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని అన్నారు. కాపులను రెచ్చగొట్టేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని రామాంజనేయులు అన్నారు.












Click it and Unblock the Notifications