తూర్పులో కీలక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి ఖరారు..!?
వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పోటీ చేసే మరో టీడీపీ అభ్యర్ధి దాదాపు ఖరారయ్యారు.
టీడీపీ ఎన్నికల కసరత్తు వేగవంతం అయింది. అభ్యర్దుల ఖరారు పైన పార్టీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేసారు. ఇప్పటికే పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను చంద్రబాబు ఖరారు చేసారు. మరి కొన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులకు ప్రకటించారు. జనసేనతో పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ ఉభయ గోదావరి జిలాల్లో అభ్యర్ధుల ఖరారు కీలకం కానుంది. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో మరో కీలక నియోజకవర్గంలో అభ్యర్ధిని టీడీపీ దాదాపు ఖరారు చేసింది.

కీలకంగా మారిన గోదావరి జిల్లాలు
ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కాలన్నా గోదావరి జిల్లాలు కీలకం. అందునా తూర్పు గోదావరిలో ఉన్న 19 నియోజకవర్గాల్లో ఈ సారి పోటీ పై ఆసక్తి కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ 4 స్థానాలు, జనసేన 1 గెలవగా మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ - జనసేన పొత్తు కారణంగా సమీకరణాలు మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో నాలుగు సిట్టింగ్ సీట్లలో వారే తిరిగి అభ్యర్ధులుగా టీడీపీ ఖరారు చేసింది. వైసీపీ నుంచి రామచంద్రాపురం, పెద్దాపురం లో సిట్టింగ్ లకు ప్రకటించారు. అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు మండపేట బాధ్యతలు అప్పగించారు. టీడీపీ - జనసేన పొత్తు అధికారం అయిన తరువాత మిగిలిన సీట్ల పైన వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
రాజా సతీమణికి ఇంఛార్జ్ బాధ్యతలు
ఇదే జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న వరుపుల రాజా కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో కన్నుమూసారు. ఆయన ఆకస్మిక మరణంతో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు హాజరైన నివాళి అర్పించారు, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలోనే ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్ గా సత్యప్రభను ప్రకటించాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును రాజా అనుచరులు కోరారు. ఇప్పుడు ఈ నియామకాన్ని పార్టీ ఖరారు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ ఇంఛార్జ్ గా వరుపుల రాజా సతీమణి సత్యప్రభను నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. రాజాకు ఉన్న ఆదరణ..ఆయన ఆకస్మిక మరణం కారణంగా ఇప్పుడు సత్యప్రభకు బాధ్యతలు అప్పగించారు.












Click it and Unblock the Notifications