టీడీపీ 6గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు, అసంతృప్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో భర్తీ కావాల్సిన 6 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్ధులను తెలుగుదేశం పార్టీ బుధవారం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు సీట్లకు ఎంఏ షరీఫ్ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం), గవర్నర్ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి(నెల్లూరు), పంచుమర్తి అనురాధ(విజయవాడ), టీడీ జనార్థన్(కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు నాయుడు(చిత్తూరు) ఎంపికయ్యారు.
ఇక ఎమ్మెల్యే కోటా కింద ఉన్న రెండు సీట్లలో ఒకటి ఆరేళ్ళ పదవీకాలం ఉన్న రెగ్యులర్ సీటు. దానిని పార్టీ మైనారిటీ నేత ఎంఏ షరీఫ్కు కేటాయించారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన స్ధానానికి రెండేళ్ళ పదవీకాలం మాత్రమే ఉంది.
ఆ ఎమ్మెల్సీని ఇటీవలే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావుకు కేటాయించారు. ఎమ్మెల్యే కోటా సీట్లకు అభ్యర్థుల పేర్లను మాత్రం పార్టీ పొలిట్బ్యూరో సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటించారు. వీరంతా గురువారం నామినేషన్ వేయనున్నారు.
ఇక గవర్నర్ కోటా సీట్ల అభ్యర్థులను ఎంపిక చేసినా వారి పేర్లను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఆ పేర్లను గవర్నర్కు పంపి, ఆయన ఆమోదించిన తర్వాతే అధికారికంగా ప్రకటించనున్నారు. స్థానిక సంస్థల కోటా కింద భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు.
ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికపై అసంతృప్తి
ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అవకాశాలివ్వడానికి, వలస వచ్చిన వారికి అవకాశాలిచ్చారంటూ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అడిగిన వారందరికీ ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినా, ఎంపికలు ఫర్వాలేదనిపించాయని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.