వీడియో: స్టేజీపై కుర్చీ విరిగి కింద పడ్డ అచ్చెన్నాయుడు: పిలిచి అవమానిస్తారా అంటూ ఫైర్
శ్రీకాకుళం: స్వాతంత్ర్య సమర యోధుడు, ఉత్తరాంధ్రకు చెందిన సర్దార్ గౌతు లచ్చన్న మీద తపాలాశాఖ రూపొందించిన పత్రేక కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, జాతీయ తపాలా బిళ్లల సేకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ-ఉత్తర అమెరికా తెలుగు సంఘం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి.
శ్రీకాకుళం జిల్లాలోని బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమాన్ని ఈ ఉదయం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథులుగా జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు, టీడీపీకే చెందిన టెక్కలి శాసన సభ్యుడు, మాజీమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. తపాలా శాఖ రీజినల్ మేనేజర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ ప్రకారం..నిర్వాహకులు మొదట వేదిక మీదికి ఉప ముఖ్యమంత్రి, అనంతరం లోక్సభ సభ్యుడు రామ్మోహన్ నాయుడిని ఆహ్వానించారు. జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హోదాలో అచ్చెన్నాయుడిని స్టేజీ మీదికి ఆహ్వానించారు. అచ్చెన్నాయుడు స్టేజీ మీదికి వచ్చే సరికే- ధర్మాన కృష్ణదాస్, రామ్మోహన్ నాయుడు తమకు నిర్దేశించిన కుర్చీల్లో కూర్చున్నారు. ఆ వెంటనే అచ్చెన్నాయుడు వేదికి మీదికి వచ్చారు. నిర్వాహకులు ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించారు.
వీడియో: స్టేజీపై కుర్చీ విరిగి కింద పడ్డ అచ్చెన్నాయుడు pic.twitter.com/ZMn3HPvWaL
— oneindiatelugu (@oneindiatelugu) October 13, 2021
రామ్మోహన్ నాయుడు పక్కనే తనకు కేటాయించిన కుర్చీలో అచ్చెన్నాయుడు కూర్చున్న వెంటనే అది వెనక్కి వాలిపోయింది. అచ్చెన్నాయుడితో పాటు రామ్మోహన్ నాయుడు ఇద్దరూ ఇద్దరూ కుర్చీతోపాటు వెనక్కి వాలిపోయారు.. కిందపడ్డారు. అక్కడే ఉన్న వారి వ్యక్తిగత భద్రతా సిబ్బంది మెరుపువేగంతో వారిని పైకి లేపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో నిర్వాహకులు బిత్తరపోయారు. స్టేజీ మీదికి చేరుకున్నారు. ఆ కుర్చీని తొలగించి.. మరొకటి వేశారు.
ఈ ఘటన పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించి మరీ.. తమ పార్టీ నాయకులను అవమానపరిచారంటూ మండిపడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తున్నారు. ఆయనకు ట్యాగ్ చేస్తూ ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని కార్యక్రమమే అయినప్పటికీ.. టీడీపీ ఉద్దేశపూరకంగా జగన్ సర్కార్ను తప్పుపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.