పోటీ చేస్తానన్లేదు, అదే బాధించింది: బాబుపై పురంధేశ్వరి
విజయవాడ: తాను పోటీ చేస్తున్నందునే సీటు విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పట్టు బడుతున్నారని వస్తున్న కథనాల పైన మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. తాను పోటీ చేస్తానని చెప్పలేదు కదా అని అమె వ్యాఖ్యానించారు. పార్టీ తన పేరు చెబితే చెప్పి ఉండవచ్చునని, పార్టీ ఇక్కడ ముఖ్యం కాని వ్యక్తులు కాదన్నారు.
తాను ఎక్కడి నుంచి పోటీ చేసేదీ ఇంకా నిర్ణయం కాలేదన్నారు. పొత్తులనేవి ఇచ్చి పుచ్చుకునేవి కావని, అవగాహన మాత్రమేనని చెప్పారు. తెలుగుదేశంతో పొత్తు కుదిరితే ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారా అని ప్రశ్నించగా తమ పార్టీ ఏది చెబితే అది చేస్తానన్నారు.
కొత్త ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి సవాల్గా మారనుందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా జిడిపి వృద్ధిపైన, ఇతర ముఖ్యమైన అంశాలపైన దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సీమాంధ్ర ప్రయోజనాలకు సంబంధించి లోకసభలో ప్రధాని ఏ ప్రకటనా చేయకపోవడంతో తాను వెంకయ్యనాయుడును కలిసి మాట్లాడానని, ఆయన చొరవ తీసుకుని ప్రధాని రాజ్యసభకు వచ్చేలా చేశారన్నారు.
రాజ్యసభలో ప్రధాని చేసిన వాగ్దానాలు నీటి మూటలు కాకూడదన్నారు. కేంద్రంలో గట్టి ప్రభుత్వం ఉంటేనేగాని సీమాంధ్ర అభివృద్ధి జరగదన్నారు. బిజెపి అధికారంలోకి రావడం ద్వారా సీమాంధ్రకు మేలు జరుగుతుందని చెప్పారు. విభజనకు బిజెపి కూడా సహకరించింది కదా అని ప్రశ్నించగా.. ఆ పార్టీ ఒకే మాటపై ఉందని, కాని కొన్ని పార్టీలు అక్కడా ఇక్కడా జెండాలు ఎగురవేసి, అక్కడా జై ఇక్కడా జై అంటున్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు.
కాగా, చంద్రబాబుతో విభేదాల పైన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు బాబుపై ఎలాంటి కోపం లేదని, అప్పట్లో జరిగిన వ్యవహరాన్ని మాత్రమే తాను వ్యతిరేకించానని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. తన తండ్రి ఎన్టీఆర్ను పదవీచ్యుతుడిని చేసిన తీరే మానసికంగా బాధించిందన్నారు.