ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి క్లీన్ స్వీప్: వారణాశిలో పవన్ కళ్యాణ్ కీలకవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నెల రోజులుగా హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరం ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు భారీగా పోలింగ్ లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో 81 శాతం పోలింగ్ నమోదు అయిందంటే ఏపీలో ఓటర్ చైతన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో సెటిలైన వారు కూడా ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఏపీకి వచ్చి ఓటు వేసి మరీ వెళ్లారు.
గెలుపు పైన ధీమాతో అన్ని పార్టీలు
ఏపీలో భారీగా నమోదైన పోలింగ్ ఏ పార్టీకి లాభసాటిగా మారుతుంది అన్నది ఇప్పుడు ఏపీలో జరుగుతున్న చర్చ. అయితే ఏపీలో ఫ్యాన్ హవానే కొనసాగుతుందని కొందరు, కూటమి విజయం ఖరారైందని మరికొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు గెలుపు పైన ధీమాతో ఉన్నారు.

ఏపీలో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందన్న పవన్ కళ్యాణ్
ఇక ఇదే సమయంలో కూటమి పార్టీ అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన నేడు చంద్రబాబుతో కలిసి వారణాసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మూడోసారి ప్రధాని మోడీనే
ఎన్డీఏ భాగస్వామిగా తాము ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని ముందుకు నడిపించిన మోడీ మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా మోడీని ఎంతగానో అభిమానిస్తాను అని పేర్కొన్న పవన్, ఆయనంటే తనకు అపారమైన గౌరవం ఉందని స్పష్టం చేశారు.
మోడీతో బంధం కొనసాగుతుంది
నరేంద్ర మోడీ తో తన అనుబంధం కొనసాగుతుందని, అది భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2014లో కూడా తాము కూటమిగా నిలబడ్డామని, మళ్లీ ఇప్పుడు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీలో కూటమి విజయం ఖరారు అయిందని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు పవన్ కళ్యాణ్.












Click it and Unblock the Notifications