అమరావతిలో తోట దగ్ధం: జగన్ వైపు వేలు! పాయింట్ లాగిన మంత్రి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని తుళ్లూరు మండలం మల్కాపురంలో చెరకు తోట తగులబడిన విషయమై తెలుగుదేశం పార్టీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మంగళవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన మండిపడ్డారు.
చెరకు తోటను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే తగులబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరకు తోటను వారే తగులబెట్టి, తమ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. శంకుస్థాపనకు వచ్చిన ప్రజల మద్దతు చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారన్నారు. జగన్ రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అంతకుముందు మంత్రి నారాయణ కూడా పంటలు తగులబడిన విషయమై స్పందించారు. పంట తగులబడిపోవడంలో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో అమరావతి రాజధానిని ప్రకటించిన సమయంలో, ఇప్పుడు శంకుస్థాపన సమయంలో రాజధాని ప్రాంతంలో ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు.
దీనిని బట్టి కుట్ర కోణం ఉందని అర్థమవుతుందని మంత్రి నారాయణ పాయింట్ లాగారు. కాగా, వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అధికార పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. జగన్ ప్రతి దానిని రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఆదివారం రాత్రి విజయవాడకు వచ్చిన జగన్.. సోమవారం ఉదయం తుళ్లూరు పరిధిలోని మల్కాపూర్లో ఇటీవల దగ్ధమైన చెరకు తోటను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై టిడిపి నేతలు మండిపడుతున్నారు.