ఏపీలో కేసుల్లో ఈయనే టాప్; సెంచరీకి చేరువగా టీడీపీ అభ్యర్థిపై కేసులు!!
రాష్ట్రంలో ఎన్నికలకు మరో రెండు రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ముగియనున్న క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు వంతులకు పైగా నామినేషన్లు దాఖలు కాగా మరో రెండు రోజులే కాదు ఉండడంతో నామినేషన్లను దాఖలు చేసేందుకు అభ్యర్థులు స్పీడ్ పెంచారు.
ఆయన కేసులపైనే రాష్ట్రం ఫోకస్
అయితే నామినేషన్లు దాఖలు చేస్తున్న క్రమంలో అఫిడవిట్ల రూపంలో అభ్యర్థులు తమ ఆస్తులను, అప్పులను తమపై ఉన్న కేసులను వెల్లడిస్తున్న క్రమంలో, ఏపీలోని రాజకీయనాయకుల ఆర్థిక పరిస్థితి, వారిపై ఉన్న కేసులు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇప్పటివరకు ఎన్నికలలో ప్రధానంగా అభ్యర్థుల ఆస్తులు, అప్పులు గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడి విషయంలో మాత్రం ఆయనపై ఉన్న కేసుల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో కేసుల్లో ఈయనే టాప్
తెలుగుదేశం పార్టీ నుంచి దెందులూరు అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన చింతమనేని ప్రభాకర్ ఆస్తులు, అప్పుల కంటే ఆయనపై ఉన్న కేసుల పైన రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాదాపు సెంచరీకి చేరువగా చింతమనేని పై కేసులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీ అభ్యర్థి పైన లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి.
రౌడీ షీట్ తో పాటు 93 కేసులు
చింతమనేనిపై రౌడీ షీట్ తో పాటుగా 93 కేసులు ఉన్నాయని తన నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో చింతమనేని స్వయంగా పేర్కొన్నారు. చింతమనేని చర, స్థిర ఆస్తులన్నీ కలిపి సుమారు రూ. 50 కోట్లకు పైచిలుకు ఉన్నాయని వెల్లడించారు. తహసిల్దార్ వనజాక్షి ఉదంతంతో పాటు, తనపై నమోదైన అన్ని కేసులు వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరిచారు.
కేసుల చిట్టా చూసి ముక్కున వేలేసుకుంటున్న జనాలు
మొత్తం చింతమనేని పై 93 కేసులు ఉండడంతో ఈ కేసుల చిట్టా చూసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్ని కేసులు ఉన్నా సరే చింతమనేని ప్రభాకర్ లో దూకుడు తగ్గదని, ఆయన స్వభావంలో మార్పు లేదని చెప్పుకుంటున్నారు. దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న చింతమనేని ప్రభాకర్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని, ప్రజల మద్దతును కూడగట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఎన్నికల ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications