రాష్ట్రంలో వరదలు- వివేకా హత్యకు సుపారీ : పార్లమెంట్ లో ప్రస్తావించండి-ఎంపీలతో చంద్రబాబు..!!
ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాల పైన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాల పైన పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా జరిగిన నష్టం పైన చర్చించాలని..జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఈ సమావేశంలో డిమాండ్ చేసారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు.

వదరల మరణాలపై న్యాయ విచారణ చేయాలి
వరదలను సమర్థంగా ఎదుర్కోవడంలో, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..పెద్ద సంఖ్యలో మరణాలు కూడా సంభవించాయి. దీనిపై న్యాయ విచారణ జరపడానికి ఒత్తిడి తేవాలని టీడీపీ అధినేత నిర్దేశించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని... ఈ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పైనా పోరాడాలని సూచించారు. పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయకపోవడాన్నీ ఎత్తిచూపాలని నిర్ణయించారు.

అమరావతి రాజధానిగా కొనసాగేలా
ఏపీలో అత్యధికంగా ఇంధన ధరలు..పన్నులు...గురించి ప్రస్తావించాలన్నారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాల్లో గళం విప్పాలని నిర్ణయించారు. ఏపీ నుంచి ఇతరా రాష్ట్రాలకు గంజాయి.. హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల సరఫరా పైన సభలో ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీ వెనుకంజలో ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. వరి వేయద్దని మంత్రులు ప్రకటించటం పైన చర్చ జరిగింది.

కేంద్ర నిధుల దుర్వినియోగం
పండించిన పంటలకు మద్దతు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం నంుచి సహకారం అందక రైతు ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించాలని తీర్మానించారు. రాజధానిగా అమరావతినే స్థిర పర్చాలని సభలో టీడీపీ ఎంపీలు డిమాండ్ చేయనున్నారు. బీసీలకు కేటాయించిన నిధులు..విధులు ఇవ్వకుండా కంటితుడుపు చర్యగా అసెంబ్లీలో ప్రభుత్వం బీసీ జనగణన పైన తీర్మానం చేసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పంచాయితీలకు కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని..దీని గురించి పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో 40 కోట్ల సుపారీ పైనా
వీటితో పాటుగా వైఎస్ వివేకా హత్య కేసులో 40 కోట్ల సుపారీ..అడ్వాన్సుగా కోటి రూపాయాల చెల్లింపు పైన ఈడీ విచారణకు పట్టుబట్టాలని పార్టీ ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు. ఇప్పటికే కేంద్రం నుంచి అధికారులు టీంలు వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాయి. 29న వారంతా సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. ఆ తరువాత కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్రం వరద సాయం ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications