పవన్ కళ్యాణ్ పై రెక్కీ చేస్తారా - వదలిపెట్టం: చంద్రబాబు ఫైర్..!!
ముఖ్యమంత్రి జగన్..ప్రభుత్వ నిర్ణయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో అరాచక పాలన పరాకష్ఠకు చేరిందని మండిపడ్డారు. ఏం తప్పు చేశారని 70 ఏళ్ల అయ్యన్న పాత్రుడిని తెల్లవారు జామున 3 గంటలకు అరెస్ట్ చేసారని నిలదీసారు. ప్రజలను ..టీడీపీ నేతలను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము వీటిని సహించేది లేదని స్పష్టం చేసారు. రఘురామ రాజును కొట్టారు.. టీడీపీ ఆఫీసుకు చెందిన నరేంద్రను కొట్టారు.. పవన్ కల్యాణ్ ఎక్కడో ఉంటే వెళ్లి రెక్కీ చేస్తారా..అందరినీ చంపేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
దసపల్లా భూములు, గంజాయి కేసులు, రుషికొండ భూములను నాశనం చేసిన వారిని అరెస్ట్ చేయండని చంద్రబాబు డిమాండ్ చేసారు.అయ్యన్న పాత్రుడి భార్య పద్మావతితో ఫోన్ లో మాట్లాడినట్లుగా చంద్రబాబు చెప్పారు. కేవలం రెండు సెంట్ల సొంత భూమిలో నాలా పన్ను కట్టకుండా ఇల్లు కట్టారని జగన్ అయ్యన్న పాత్రుడి పై కేసు పెట్టారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ రే 41వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఛార్జ్ షీట్ లో పేర్కొందని చంద్రబాబు గుర్తు చేసారు. నాడు వైఎస్ ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులు అంతా జైలుకు వెళ్లారన్నారు. ఇప్పుడు తప్పు చేస్తున్న అదికారులూ జైలుకు వెళ్తారని చంద్రబాబు హెచ్చరించారు.
అయ్యన్న పాత్రుడి కుమారుడు రాజేష్ ను పోలీసులు కొట్టినట్లుగా తమకు సమాచారం ఉందని చంద్రబాబు వెల్లడించారు. విశాఖలో ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రూ 23 వేల కోట్ల రుణం తెచ్చుకున్న ఈ ప్రభుత్వం ఆ నిధులు ఏం చేసిందో చెప్పదంటూ విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వమా ఉత్తరాంధ్ర గురించి పాటుపేడదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. వివేకా హత్య కేసులో షర్మిల సీబీఐ ముందు స్టేట్ మెంట్ ఇచ్చారంటూ వస్తున్న వార్తల పైన చంద్రబాబు స్పందించారు. షర్మిల సీబీఐకు స్పష్టత ఇచ్చిన తరువాత కూడా బాబాయ్ హంతకులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదని చంద్రబాబు నిలదీసారు. సీఐడీ కార్యాలయం పెద్ద టార్చర్ కార్యాలయంలా మారిందని చంద్రబాబు ఆరోపించారు.