ఎన్డీఏలోకి టీడీపీ - ప్రధాని దారిలోనే, తేల్చేసిన చంద్రబాబు..!!
టీటీడీ అధినేత చంద్రబాబు కొత్త సంకేతాలు ఇచ్చారు. ప్రధాని మోదీ పైన ప్రశసంలు గుప్పించారు. తిరిగి ఎన్టీఏలో చేరిక పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రధానితో తనకు సైద్దాంతిక విభేదాల్లేవని స్పష్టం చేసారు. గతంలో తాను ఎన్డీఏకు దూరం అయిన కారణాలను విశ్లేషించారు. ప్రధాని తీసుకొనే నిర్ణయాలకు మద్దతిచ్చే అంశంలోనూ తన వైఖరి స్పష్టంగా వివరించారు. ఏపీలో 2024 ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న చంద్రబాబు వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.
మళ్లీ ఎన్టీఏతో బంధం పై:2019 ఎన్నికల ముందు ఎన్టీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఇప్పుడు తిరిగి చేరికపైన చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఎన్డీఏలో తమ పార్టీ కలుస్తుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. పరోక్షంగా సానుకూల సంకేతాలు ఇచ్చారు. గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా ప్రధాని మోదీతో తమకు విధానపరమైన విభేదాలేవీ లేవని గుర్తు చేసారు. ప్రధాని విధానాలను వ్యతిరేకించలేదని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరామని..అది రాకపోవటం కారణంగానే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. రిపబ్లిక్ టీవీ చర్చాగోష్టిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాలు వేరు.. దేశం వేరని చెప్పారు. ప్రపంచంలో భారతదేశాన్ని ప్రధాని మోదీ బాగా ప్రమోట్ చేస్తున్నారని ప్రశంసించారు.

ఎవరు ఎవరితో కలుస్తారు:ప్రధాని మోదీ అమలు చేస్తున్న విజన్ 2047 కి మద్దతిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటికి ప్రపంచంలో అగ్రగామిగా మన దేశాన్ని నిలపాలని ఆయన అనుకుంటున్నారని చెప్పారు. దేశాభివృద్ధి కోణంలో ఆయన విధానాలకు ఒక భారత పౌరుడిగా మద్దతిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. భారత జాతి అభ్యున్నతికి ప్రధాని మోదీ సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. రాజకీయంగా ఎవరు ఎవరితో కలుస్తారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందని, ఊహాజనిత ప్రశ్నలకు తానిప్పుడు సమాధానం చెప్పనని స్పష్టం చేశారు. తనకు అధికారం ముఖ్యం కాదన్నారు. వాజపేయి మా పార్టీకి తన మంత్రివర్గంలో 7-8 మంత్రి పదవులు ఇస్తామన్నా తాము తీసుకోలేదన్నారు. దేశం విషయంలో రాజకీయాలకు తావు లేదని పేర్కొన్నారు. ఎక్కడ అభివృద్ధి ఉన్నా మేం కలుస్తాం... మద్దతిస్తామని చంద్రబాబు స్పష్టం చేసారు.
ఆ కరెన్సీ నోట్లు రద్దు చేయాలి:ప్రతిపక్షాలు పనిగట్టుకుని మోదీని విమర్శిస్తున్నాయా అన్న ప్రశ్నకు చంద్రబాబు సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఎన్టీఏ నుంచి వెళ్లినందుకు విచారిస్తున్నారా అనే ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం లేదు. తొలుత విమర్శలు వచ్చినా ఇప్పుడు జీఎస్టీ పన్నుల వలన పన్నుల ఎగవేత తగ్గుతోందని, ఆదాయం పెరుగుతోందన్నారు. దీనితోపాటు అవినీతి తగ్గించాలి. రూ.500, అంతకుపైన ఉన్న కరెన్సీ నోట్లు రద్దు చేయాలి. దీనివల్ల రాజకీయ అవినీతి తగ్గుతుందని పేర్కొన్నారు. రాజకీయ అవినీతి, ఓటర్లకు డబ్బు పంపిణీ నిరోధించగలిగితే దేశం ఇంకా ముందుకు వెళ్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని ప్రపంచ రంగంపై ప్రమోట్ చేయడంలో ప్రధాని మోదీ కృషిని అభినందించారు. మోదీ జాతీయ స్థాయిలో ఏం సాధించాలని అనుకుంటున్నారో రాష్ట్ర స్థాయిలో తామూ సాధించి చూపించాలనుకుంటున్నామని వివరించారు. చంద్రబాబు చేసిన కామెంట్స్, ఇప్పుడు బీజేపీ..టీడీపీ పొత్తు దిశగా కొత్త చర్చలకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications