సీఎం జగన్ ఓట్ బ్యాంక్ పై చంద్రబాబు కొత్త స్ట్రాటజీ..!!
ఏపీలో ఎన్నికలకు సీఎం జగన్ వర్సస్ చంద్రబాబు కొత్త వ్యూహాలతో సిద్దం అవుతున్నారు. వైనాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళ్తున్నారు. అధికారం ఖాయమని ధీమాగా ఉన్నారు చంద్రబాబు. ఈ సమయంలో సీఎం జగన్ ప్రధానంగా నాలుగు వర్గాల పైన ఫోకస్ చేసారు. వారిని ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అదే ఓట్ బ్యాంక్ పైన చంద్రబాబు దృష్టి పెట్టారు. జగన్ నమ్ముకున్న ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
జగన్ ఓట్ బ్యాంక్ పై గురి : ముఖ్యమంత్రి జగన్ 2019లో పక్కా సామాజిక సమీకరణాల అమలుతో ఎన్నికల్లో 151 సీట్లు గెలిచారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని పథకాల్లోనూ ఈ వర్గాల కేంద్రంగానే అమలు చేస్తున్నారు.

అందునా మహిళలకు నేరుగా లబ్ది అందేలా అమలు కొనసాగిస్తున్నారు. ప్రతీ సభలోనూ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా పేదలు అంటూ వారితో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా బీసీ గర్జన నిర్వహించిన వైసీపీ త్వరలో ఎస్సీ, ఎస్టీ గర్జనల నిర్వహణకు నిర్ణయించింది. ఇదే సమయంలో టీడీపీ అప్రమత్తం అయింది.
చంద్రబాబు కొత్త వ్యూహం : ముఖ్యమంత్రి జగన్ సామాజిక న్యాయం పేరుతో దళిత వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు దీనికి కౌంటర్ స్ట్రాటజీ సిద్దం చేస్తున్నారు. దళిత నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. ప్రతీ దళిత గడపకు టీడీపీ వెళ్లాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
ఇందుకోసం టీడీపీ ఎస్సీ సెల్ విభాగంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం ఖరారు పైన కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా టీడీపీ హయాంలో ఎస్సీల అభ్యున్నతి కోసం ఏకంగా 27 సంక్షేమ పథకాలను వివరించనున్నారు. జగన్ పాలనలో దళితులు మోసపోయారనే ప్రధాన ప్రచారాస్త్రంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఓట్ బ్యాంక్ దక్కేదెవరికి : ఏపీలో మొత్తం 29 అసెంబ్లీ రిజర్వుడు స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్కరే దళిత వర్గాలకు చెందిన అభ్యర్ధి విజయం సాధించారు. అదే విధంగా ఎస్టీ, మైనార్టీ నియోజకవర్గాల్లోనూ వైసీపీనే ఏకపక్షంగా విజయం సాధించింది. దీంతో, ఇప్పుడు ప్రతీ సీటు కీలకంగా మారుతున్న సమయంలో జగన్ వైపు దళిత ఓటర్లు తరలి పోకుండా తమ వైపు తిప్పుకొనేందుకు కొత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అదే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా దళిత వర్గాలకు ఇవ్వాల్సిన హామీల పైన కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా జగన్ నమ్ముకున్న ప్రధాన ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో..ఇప్పుడు ఎస్సీ ఓట్ బ్యాంక్ జగన్ - చంద్రబాబు మధ్య ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications