అమరావతిపై మడమతిప్పిన జగన్-చంద్రబాబు ఫైర్-పసిబిడ్డను మూడుముక్కలా-నారాయణ ప్రశ్న
తిరుపతిలో జరిగిన అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నారాయణ, బీజేపీ నేత కన్నాలక్ష్మీనారాయణ జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అమరావతి రైతుల పాదయాత్రను అభినందించిన నేతలు.. జగన్ సర్కార్ మూడురాజధానుల ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఎలాగైనా కాపాడుకుని తీరుతామని నేతలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతల వ్యాఖ్యలు ఓసారి చూద్దాం..
అమరావతి సభలో చంద్రబాబు కామెంట్స్
అమరావతి రైతులు ఇవాళ తిరుపతిలో నిర్వహించిన రాజధాని సభలో టీడీపీ ఆధినేత చంద్రబాబు మాట్లాడారు. 45 రోజులు 450 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అమరావతి రైతుల్ని అభినందించారు. అమరావతి ఉద్యమంలో 180 మంది రైతులు చనిపోయారని,. వేల సంఖ్యలో కేసులు పెట్టారని,. 225 మందిపై కేసులు పెట్టి 500 మందిని జైలుకు పంపారని చంద్రబాబు ఆరోపించారు ఎస్సీలపైనే ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన పనికిమాలిన, దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ సర్కార్ అని చంద్రబాబు మండిపడ్డారు. ఈ రైతులు చేసిన పాపమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అయితేనే రాజధాని కడతాడని రైతులు భూములిచ్చారని, . వారికి ఇప్పటికీ ధన్యవాదాలని చంద్రబాబు తెలిపారు. భూమిస్తే ఓ పాలసీ ప్రకారం మీకు నష్టం లేకుండా చేస్తానని హామీ ఇచ్చానని వెల్లడించారు. అమరావతిలోనే రాజధానికే కట్టుబడి ఉన్నామని ఇక్కడున్న బీజేపీ చెప్పిందని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. శివరామకృష్ణన్ కమిటీ వేశారని గుర్తుచేశారు. ఐదుకోట్ల మందికి రాజధాని, దేవతల రాజధాని అమరావతే రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి చెప్పారని చంద్రబాబు తెలిపారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని, ఎవరికీ ఆందోళన అవసరం లేదని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే సీపీఐ రామకృష్ణ కూడా ముందు నుంచీ అమరావతి పోరాటనికి మద్దతిచ్చారని, ఇక్కడికి రాలేకపోయినా సీపీఎం కూడా అమరావతికి తమ మద్దతుంటుందని సందేశం ఇచ్చిందన్నారు.
అమరావతి ఐదుకోట్ల ఆంధ్రుల పోరాటం
జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధానిగా పెట్టాలని కోరారని చంద్రబాబు తెలిపారు.. 13 జిల్లాల చిన్నరాష్ట్రం కాబట్టి అమరావతే రాజధానిగా ఉండాలన్నారు. మడమ తిప్పని నేత జగన్ రెడ్డి అని చెప్తారని, అమరావతిపై మడమ తిప్పారా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిపై మీకు ఎందుకీ కుళ్లు అని నిలదీశారు. అమరావతిపై కుల ముద్ర వేశారని, ఈ సభకు వచ్చిన నాయకులందరిదీ ఏ కులం అని అడిగారు. దసరా రోజు వచ్చి ప్రధాని నరేంద్రమోడీ శంఖుస్ధాపన చేసారని, భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు మీరు వచ్చి ఇష్టానుసారంగా మార్చేస్తానంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి కొందరి రాజధాని అని చెప్తున్నారని, కానీ ఇది ప్రజా రాజధాని అని చంద్రబాబు తెలిపారు. ప్రజా రాజధాని అమరావతిని మూడు ముక్కలాట ఆడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతి మునిగిపోతుందని చెప్పారని, కానీ మూడేళ్లుగా మునిగిపోయిందా అని నిలదీశారు. హైదరాబాద్, చెన్నై కంటే బలహీనమైన భూమి అని ఆరోపించారని, కానీ ఐఐటీ అందుకు విరుద్ధంగా నివేదిక ఇచ్చిందన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయని చంద్రబాబు తెలిపారు.
జగన్ కు చంద్రబాబు సవాల్
నువ్వు ఎన్నైనా కేసులు పెట్టొచ్చు. కానీ మేం చేసేది ధర్మపోరాటమని సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు సవాల్ విసిరారు. ధర్మపోరాటంలో మాదే విజయం అన్నారు. అమరావతి రైతులు చేసే పోరాటం ఐదు కోట్ల ఆంధ్రులది అని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో వచ్చే ఆదాయం వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ఇబ్బందులు తీర్చే శక్తి ఉందన్నారు.
శ్రీకాకుళం నుంచైనా, అనంతపురానికైనా దగ్గరుండే స్ధలం అమరావతేనని చంద్రబాబు తెలిపారు. అమరావతి పని పూర్తయి ఉంటే పది వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామని, మీరు ఎప్పుడు కూర్చుని పని చేస్తున్నారని జగన్ ను ప్రశ్నించారు. సచివాలయం, హైకోర్టు రైతుల భూముల్లోనే ఉన్నాయన్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా అమరావతిని విధ్వంసం చేయకుండా ఉంటే రాజధాని అభివృద్ధి అవుతుందన్నారు. అమరావతిని కాపాడుకునే బాధ్యత ఐదుకోట్ల మంది తమ భుజాలపై పెట్టుకుంటారన్నారు. అమరావతిని కాపాడుకుందాం.. ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందామన్నారు.
జగన్ చరిత్ర హీనుడన్న కన్నా లక్ష్మీనారాయణ
అమరావతిలో రాజధాని పెట్టాలనుకున్నప్పుడు రాజకీయ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి అప్పట్లో 33 వేల ఎకరాల భూమి రైతులు ఇచ్చారని,. నిర్ణయం చేయడం వరకే రాష్ట్ర ప్రభుత్వ భాగం. ఆ తర్వాత 29 గ్రామాల రైతులు అని, 2 వేల కోట్లతో బాండ్లు అమ్మిన వ్యవహారం, 10 వేల కోట్లు పెట్టుబడి పెట్టిన వ్యవహారం, కేంద్రం రాజధాని అభివృద్ధికి 2500 కోట్లు ఇచ్చినా, విజయవాడకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చినా, మంగళగిరిలో ఎయిమ్స్ ఇచ్చినా కేంద్రం ఇచ్చిన మద్దతులో భాగమేనన్నారు. ఆ తర్వాత ఒక్క అవకాశం ఇమ్మని అధికారంలోకి వచ్చిన జగన్.. అమరావతిలో దోచుకోవడానికి ఏమీ లేదని విశాఖను రాజధానిగా ఎంచుకున్నారని కన్నా ఆరోపించారు. విశాఖలో రాజధాని వస్తుందంటే అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న మంత్రులు.. ఇప్పటిదాకా మూడు రాజధానులకు ఒక్క ఇటుకైనా పెట్టారా అని కన్నా అడిగారు. దోపిడీ కోసమే మూడు రాజధానుల మంత్రం జపిస్తున్నారని ఆరోపించారు. అన్ని వ్యవస్ధల్ని నాశనం చేసిన చరిత్ర హీనుడిగా జగన్ నిలిచారన్నారు.
పనికందును మూడు ముక్కలు చేస్తారా ?
అమరావతి అందరి రాజధాని అని, రాష్ట్ర రాజధాని అని సీపీఐ నారాయణ అన్నారు. కొత్తగా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ సీపీఐ ఒకే మాట మీద ఉన్నామన్నారు. అమరావతి ముచ్చటైన శిశువుని కంటే, దాన్ని మోడీ చేతిలో పెడితే ఆంధ్రరాష్ట్రాని అప్పజెప్పారని, కానీ ఇప్పటి ముఖ్యమంత్రి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారని నారాయణ విమర్శించారు. పసి కందును మూడు ముక్కలు చేసిన ముఖ్యమంత్రి జగన్ అని నారాయణ ఆరోపించారు. 45 రోజులుగా మహిళలు అగ్నిగుండం తొక్కినట్లుగా పాదయాత్ర చేస్తూ వచ్చారన్నారు. అమరావతి పోరాటంలో రైతుల కన్నీరు వృథా పోదన్నారు. ఢిల్లీ, కలకత్తా వెళితే మీ రాజధాని ఏది అని అడుగుతున్నారని, తల ఎక్కడ పెట్టుకోవాలని నారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తానని అడిగితే తెలివైన వారైన కృష్ణా, గుంటూరు ప్రజలు భూములిచ్చేవారా అని ప్రశ్నించారు.