అప్పలనాయుడూ.. ఫ్లైట్ టికెట్కు డబ్బులున్నాయా?: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు కేటాయించేటప్పుడు ఓ సామాన్య కార్యకర్తకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. విజయం సాధించిన తర్వాత ఆయన్ను దగ్గరకు తీసుకొని ఆర్థిక పరిస్థితుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ వ్యవహారాలంటే ఎంతో కఠినంగా వ్యవహరిస్తారనే పేరు ఉన్న చంద్రబాబు వ్యక్తుల విషయంలో మాత్రం ఎలా ఉంటారు అనేదానికి ఈ సంఘటనే ఉదాహరణగా నిలిచింది.
ఎంపీలతో సమావేశం
గురువారం రోజు విజయం సాధించిన 16 మంది ఎంపీలతో చంద్రబాబు సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో విజయనగరం నుంచి గెలుపొందిన అప్పలనాయుడి ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. ఎందుకంటే ఎంపీలంతా ఎన్డీయే ఎంపీల సమావేశానికి శుక్రవారం హాజరు కావాల్సి ఉంది. అందరూ సమావేశానికి రావాలని చంద్రబాబు ఎంపీలకు ఆదేశాలు జారీచేశారు.

అప్పలనాయుడి గురించి ఆరా
ఈ సందర్భంగా అప్పటనాయుడిని బాబు ఢిల్లీ వెళ్లడానికి విమానం టికెట్ ఉందా? లేదంటే చెప్పు మనవాళ్లు బుక్ చేస్తారు అని చెప్పడం అందరి హృదయాలను కదిలించడమే కాదు భావోద్వేగానికి గురిచేసింది. ఈ ఎన్నికలు టీడీపీ ఎంత ప్రతిష్టాత్మకమో తెలిసినా చంద్రబాబు మాత్రం విజయనగరం నుంచి పార్టీ కార్యకర్తకే టికెట్ కేటాయించారు. ఆయన గెలుపుకోసం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేవారు. స్థానికంగా ఉండే నేతలందరికీ ఆదేశాలు జారీచేసి అప్పలనాయుడిని సమన్వయం చేసుకుంటూ, ఆయనతో కలిసి పనిచేస్తూ, అతని విజయం కోసం కృషిచేసేలా చూశారు.
కష్టపడితే పదవులు వస్తాయి
పార్టీలో కష్టపడి పని చేసే వారికి పదవులు వస్తాయని చెప్పేందుకు అప్పలనాయుడే ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాన్య కార్యకర్తకు, నాయకులకు కష్టపడి పనిచేస్తే పార్టీలో పదవులు లభిస్తాయనేదానికి ఇదే ఉదాహరణ అన్నారు. వ్యక్తి ఆర్థిక పరిస్థితులను చూసి పార్టీ టికెట్ ఇవ్వదని.. పార్టీకి సేవలు అందించిన నేత కనుకే అప్పలనాయుడికి టికెట్ ఇచ్చామని బాబు స్పష్టం చేశారు. పార్టీ కోసం పని చేసుకుంటూ వెళుతుంటే అవకాశాలు వాటంతటవే వరిస్తాయన్నారు.












Click it and Unblock the Notifications