దాసరి సామాజికవర్గ సమావేశంలో చంద్రబాబు!
ఆర్థిక సంస్కరణల అమలుతో సంపద సృష్టించి దేశానికే ఆదర్శంగా నిలిపామని, ప్రజలకు సంపద, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎన్నో విధానాలు అమలు చేశామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. తాను ముందుచూపుతో ఆలోచిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దొంగచూపుతో ఆలోచిస్తున్నారని, ఎక్కడ? ఎలా దోచుకోవాలో ఆలోచించి దాన్నే అమలు చేస్తున్నారని మండిపడ్డారు. సాంకేతిక రంగంలో భవిష్యత్తులో ఎటువంటి ఫలాలు అందుకోగలమో అనే తాను ఆలోచించానన్నారు.
విజయనగరం జిల్లా ఎస్.కోటలో దాసరి సామాజిక వర్గీయుల ఆత్మీయ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, మీ అందరి అండతో అధికారంలోకి వస్తామన్నారు. ప్రభుత్వం, పేదల భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడతానన్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి గుడిలో స్వామికి దీపం పెట్టేది దాసరి సామాజిక వర్గీయులేనని, వారి ఎదుగుదలకు అన్ని విధాలా చేయూతనందిస్తానని, సంచార జాతికి చెందిన వీరిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో పార్టీ పరంగా విధాన నిర్ణయాన్ని రూపొందిస్తామన్నారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పార్టీ దాసరి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ తుపాకుల అప్పారావు, మాజీ ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారి, పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రులు కోండ్రు మురళీమోహన్, విజయనగరం, విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గాల అధ్యక్షులు కిమిడి నాగార్జున, శ్రీభరత్తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఏం చేస్తే బాగుంటుంది? వారికి ఏ రకంగా ఊతమివ్వగలం? అనే అంశంపై రెండు నెలల్లో పార్టీ పరంగా ఒక ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications