వైఎస్ షర్మిల లైన్ వెళ్తోన్న చంద్రబాబు..!!
అమరావతి: అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో పోటాపోటీ రాజకీయం నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తోన్నారు. సంక్షేమ పథకాల నిధులను జనం మధ్యే విడుదల చేస్తోన్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇవ్వాళ కూడా ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లికి వెళ్లారు. విద్యా దీవెన కింద నాలుగో విడత నిధులను మంజూరు చేశారు. శుక్ర, శనివారాల్లో తన సొంత నియోజకవర్గం కడపజిల్లా పులివెందులకు వెళ్లనున్నారు.
పోటీగా చంద్రబాబు..
మరోవంక- తెలుగుదేశం పార్టీ కూడా తగ్గట్లేదు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో పాల్గొంటోన్నారు. ఒక్కో జిల్లాలో మూడు రోజుల పాటు మకాం వేస్తోన్నారు. ఇదివరకు కర్నూలు జిల్లాలో పర్యటించారాయన. ఇప్పుడు తాజాగా ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాల పర్యటకు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే బహిరంగ సభలు, రోడ్షోలను నిర్వహిస్తోన్నారు.
స్థానిక ఎమ్మెల్యేలే టార్గెట్..
ఈ పర్యటనల్లో చంద్రబాబు నాయుడు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను లక్ష్యంగా చేసుకుంటోన్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. స్థానిక అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తోన్నారు. వాటిని సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ఎమ్మెల్యేలు విఫలం అయ్యారంటూ మండిపడుతున్నారు. స్థానిక అధికార, పోలీసు యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోన్నారంటూ ధ్వజమెత్తుతున్నారు.
అవినీతి ఆరోపణలతో..
దెందులూరు, చింతలపూడిలో పర్యటించిన చంద్రబాబు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కొఠారి అబ్బయ్య చౌదరి, ఎలీజా, తాడేపల్లిగూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణనూ వదల్లేదు. ఎమ్మెల్యేలు స్థానిక వ్యాపారులను దోచుకుంటోన్నారంటూ నిప్పులు చెరుగుతున్నారాయన. వీధి దీపాల అంశాన్నీ కూడా చంద్రబాబు ప్రస్తావిస్తోన్నారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, బంధువులు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోన్నారు.
షర్మిల తరహాలో..
ఈ జిల్లా స్థాయి పర్యటనల విషయంలో చంద్రబాబు.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తోన్న షర్మిల స్థానిక అంశాలపైనే దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. గ్రామస్థాయిలో ఆమె సమస్యలను ప్రస్తావిస్తోన్నారు. స్థానిక ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుంటోన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ అనే తేడా చూపట్లేదు. లోకల్ ఎమ్మెల్యేల వైఖరిని ఆమె ఎండగడుతోన్నారు.
ఎమ్మెల్యే అనుచరుల దాడి
ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై దాడి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నర్సంపేట్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఆమెపై దాడికి కారణం అయ్యాయి. ఆమె కాన్వాయ్పై పెద్ది సుదర్శన్ రెడ్డి అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి, కారును పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో కారు అద్దాలను పగులగొట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికీ నిప్పంటించారు. అక్కడే అమర్చిన వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను తగులబెట్టారు.