ఈసారికి చంద్రబాబును అలా చేయొద్దంటున్నారు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ కనపడుతోంది. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉన్నప్పటికీ గతంలో చేసిన పొరపాట్లు చేయకుండా క్షేత్రస్థాయిలో పనిచేసుకుంటు వెళ్లాలని కొందరు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను నమ్ముకోవడంకన్నా తెలుగుదేశం పార్టీ బలాన్ని నమ్ముకొని ఎన్నికలకు వెళితే మేలంటున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అభ్యర్థులను చివరి నిముషంలో ఖరారు చేశారని, దీనివల్ల అసంతృప్తులను బుజ్జగించడానికి అవకాశం లేకుండా పోయిందని గుర్తుచేస్తున్నారు.
టికెట్లు దక్కనివారు చివరి నిముషంలో రెబల్ గా పోటీచేయవచ్చని, అలా కాకుండా ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని, దీనివల్ల టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించడానికి అవకాశం ఉంటుంది. కొందరు సీనియర్ నేతలు చంద్రబాబును కలిసి హామీ తీసుకుంటుండగా కొత్త తరం నేతలు లోకేష్ ను కలిసి టికెట్ విషయంలో హామీ తీసుకుంటున్నారు. తన సహజ స్వభావానికి భిన్నంగా చంద్రబాబు ఏడాది ముందునుంచే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారికంగా అక్కడికక్కడే ప్రకటించారు.

ప్రస్తుతం నారా లోకేష్ తాను చేస్తున్న పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పాత తరం నేతలు చంద్రబాబు దగ్గర, కొత్త తరం నేతలు లోకేష్ దగ్గర హామీ తీసుకుంటుండటంతో తీవ్ర గందరగోళం నెలకొంటోంది. టికెట్లకు సంబంధించిన విషయాన్ని ఎవరో ఒకరు స్పష్టంగా ప్రకటన చేస్తే పార్టీ శ్రేణుల్లో ఉన్న గందరగోళం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఇప్పటికే 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పచ్చజెండా ఊపారని, వారంతా పనిచేసుకుంటున్నారని చెబుతున్నారు. అయితే అధికారికంగా ప్రకటించడకపోవడంవల్ల సొంత పార్టీలోనే ఉండే రెబల్స్ వల్ల నష్టపోయే ప్రమాదముందని, దీన్ని నివారించాలంటే సాధ్యమైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications