పేపర్ లీకేజీల సంచలనం: అయినా ధర్మేంద్ర ప్రధాన్ సీటు సేఫ్.. ఎందుకు?
ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు, చేర్పులు జరగబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే మోదీ మంత్రివర్గం నుంచి ఏయే మంత్రులను తొలగించవచ్చు, ఎవరికి కొత్తగా చోటు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలా పదవులు కోల్పోయే మంత్రుల జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒక వేళ మార్పులు చేయాలనుకుంటే ధర్మంద్ర ప్రధాన్ శాఖను మార్చవచ్చేమో గానీ.. మరోవైపు విద్యాశాఖను కూడా ఆయన చేతుల్లోనే ఉంచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అసలు ఆయనను తొలగిస్తారనే ప్రచారానికి గల కారణాలు, దాని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి.. కారణమేంటి?
ఇటీవలి కాలంలో జరిగిన నీట్-యూజీ పేపర్ లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విపక్షాలు కూడా ఆయన రాజీనామా చేయాలంటూ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. 'కాక్రోచ్ జనతా పార్టీ' వంటి కొన్ని ప్రజా సంఘాలు విద్యామంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో ఆందోళనలు నిర్వహించాయి. జూన్ 28న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ కూడా ఈ డిమాండ్కు మద్దతుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీనికి తోడు గతంలో యూజీసీ జారీ చేసిన ఓ సర్క్యులర్ విషయంలోనూ ప్రధాన్ విమర్శలు ఎదుర్కొన్నారు.

విపక్షాల ఒత్తిడికి తలొగ్గని మోదీ నైజం
ధర్మేంద్ర ప్రధాన్పై ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన పదవికి ముప్పేమీ లేదని చెప్పడానికి ప్రధాన కారణం ప్రధాని నరేంద్ర మోదీ శైలి. ప్రతిపక్షాలు లేదా ఆందోళనకారుల ఒత్తిడికి లొంగి తన మంత్రివర్గంలోని సహచరులను తొలగించిన సందర్భాలు ప్రధాని మోదీ హయాంలో చాలా అరుదు. గతంలో 'మీ టూ' ఉద్యమం తీవ్రరూపం దాల్చినప్పుడు ఎం.జె. అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ అది వ్యక్తిగత లైంగిక వేధింపుల ఆరోపణల వల్ల జరిగింది తప్ప ప్రభుత్వ పనితీరుకు సంబంధించింది కాదు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు అంతటి తీవ్రమైనవి కావు. గతంలో సోనమ్ వాంగ్చుక్ లడఖ్ కోసం చేసిన ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసి, ఆయన్ను ఆరు నెలల పాటు జాతీయ భద్రతా చట్టం కింద జైల్లో ఉంచింది. కాబట్టి ఇప్పుడు వాంగ్చుక్ మద్దతు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని మోదీ విపక్షాల డిమాండ్కు తలొగ్గి ప్రధాన్ను తొలగిస్తారనే సంకేతాన్ని ఇచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు.
ప్రభుత్వ ఎజెండాను సమర్థవంతంగా అమలు చేయడం
ధర్మేంద్ర ప్రధాన్ పదవి సురక్షితంగా ఉండటానికి మరో ముఖ్యమైన కారణం.. పార్టీ, ప్రభుత్వ విధానాలను ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత నిబద్ధతతో అమలు చేస్తుండటమే. కేంద్ర విద్యాశాఖలో ప్రభుత్వం ఆశిస్తున్న మార్పులను ఆయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో దేశ అత్యవసర పరిస్థితి, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వంటి అంశాలను చేర్చడం.. అలాగే గుజరాత్ దంగాలు, మొఘల్ చక్రవర్తుల చరిత్ర, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవితలను తొలగించడం వంటివి ప్రభుత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా జరిగినవే. జూన్ 26న ధర్మేంద్ర ప్రధాన్ 57వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో ప్రధాన్ అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని బహిరంగంగానే కొనియాడారు.
పేపర్ లీకేజీలు కొత్త కాదు.. చర్యలూ తక్కువే!
పేపర్ లీకేజీ అంశాన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అస్త్రంగా వాడుకుంటున్నప్పటికీ.. ఇది కేవలం ఈ ప్రభుత్వ హయాంలోనే వచ్చిన సమస్య కాదు. గత రెండు దశాబ్దాలుగా (2002 నుండి 2025 మధ్య) దేశంలో దాదాపు 45 పెద్ద పేపర్ లీకేజీ కేసులు నమోదయ్యాయి. 2015 తర్వాత పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దాదాపు 150 కేసులు నమోదైనప్పటికీ.. ఏ ఒక్క పెద్ద అధికారిపైనా లేదా మంత్రిపైనా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత 11 ఏళ్లలో కేవలం ఒక్క కేసులో మాత్రమే కోర్టు నిందితులకు శిక్ష విధించింది. కాబట్టి కేవలం ఈ ఒక్క కారణంతో ధర్మేంద్ర ప్రధాన్ను బలిపశువును చేయరని స్పష్టమవుతోంది.
మోదీ-షా ద్వయంతో బలమైన బంధం
ధర్మేంద్ర ప్రధాన్కు బీజేపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, పార్టీ లేదా అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను సైలెంట్గా పూర్తి చేసే పనితనం ఉన్న నాయకుడనే ఇమేజ్ ఆయనకు ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయంతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే 2014 నుంచి ఆయన నిరంతరంగా కేంద్ర మంత్రిగా కొనసాగుతూ, రాజకీయ వర్గాల్లో 'మోదీ-షాల హనుమంతుడు'గా గుర్తింపు పొందారు. ఈ కారణాలన్నీ పరిశీలిస్తే ధర్మేంద్ర ప్రధాన్ మంత్రివర్గం నుంచి తప్పుకుంటారనే ప్రచారంలో ఎలాంటి బలం లేదని అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications