ప్రజలు ఇచ్చింది ముందస్తు తీర్పు-ఇక ఆటలు సాగవు-ఉగాది సంబరాల్లో చంద్రబాబు కామెంట్స్..
గుంటూరు : ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో పులుపుల వెంకట ఫణి కుమార్ శర్మ పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాక్షాంక్షలు తెలిపారు.
ఉగాది పండుగతో తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉభయతెలుగురాష్ట్రాల్లోని తెలుగువారితోపాటు, ప్రపంచంలోని తెలుగువారందరికీ హృదయపూర్వక ఉగాదిశుభాకాంక్షలు తెలిపారు. ఆరు రుచుల సమ్మిళితమైన ఉగాదిపచ్చడి ద్వారా నూతన తెలుగుసంవత్సరాన్ని ప్రారంభిస్తామన్నారు. కష్టాలు,సుఖాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ జీవితంలో ఉంటాయన్నారు. వాటన్నింటి కలబోతల రూపమే జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు... అనుభవాలు అని చెప్పేందుకే ఆరు రుచులతో ఉగాది పచ్చడి చేస్తారని చంద్రబాబు పేర్కొన్నారు.

రాబోయేరోజులు ఎలా ఉండబోతున్నాయో ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పుద్వారా ముందే చెప్పారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పు మామూలు తీర్పుకాదన్నారు. ఎన్నిసమస్యలు సృష్టించినా, భయపెట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తిరుగుబాటుచేశారన్నారు. ప్రజాపాలనలో ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవాల్సిన వారు నియంత్రత్వ పాలన సాగిస్తున్నారని జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బాధ్యతతో ప్రవర్తించకుండా, బరితెగించి వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇక అలాంటి వారి ఆటలు సాగవని ప్రజలు చాటిచెప్పారన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా బాగా వర్షాలుపడి, రైతులఆదాయం పెరిగి, కుటుంబాలతో వారు సంతోషంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రప్రభుత్వ పన్నులభారం, పెరిగినధరలతో ప్రజలు ఇప్పటికే కష్టాలుపడుతున్నారన్నారు. పంచాంగలో మరలా ఈ సంవత్సరంకూడా ధరలు పెరుగుతాయని చెప్పారు. దీనిపై మనం పాలకుల్ని నిలదీయాలి, ప్రజలకు అండగా ఉండాలన్నారు. పంచాంగం అనేది శాస్త్రోక్తంగా జరిపేప్రక్రియ. దాన్నిమనం నమ్మాల్సిందేనన్నారు. తెలుగుజాతి అనేకరంగాల్లో ఉన్నతస్థానాల్లో ఉందన్నారు.

ప్రపంచంలో ఏదేశానికి వెళ్లినా తెలుగువారు బ్రహ్మండంగా రాణిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పార్టీనేలతో కలిసి చంద్రబాబు నాయుడు ఉగాది పచ్చడి తీసుకున్నారన్నారు. పంచాంగ పఠనం చేసిన వెంకట ఫని కుమార్ తెలుగు దేశం పార్టీకి రానున్న రోజుల్లో శుభం జరగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాంగ పఠనం చేసిన పులపుల వెంకటఫణికుమార్ శర్మను, ఇతర పండితులను చంద్రబాబు సత్కరించారు.












Click it and Unblock the Notifications