జగన్ కు చంద్రబాబు లేఖ-దిశ ఉన్నట్లా ? లేనట్లా ? బెజవాడ గ్యాంగ్ రేప్ పై కఠిన చర్యలకు డిమాండ్

ఏపీలోని విజయవాడలో తాజాగా చోటు చేసుకున్నగ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో సీఎం జగన్ కు విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాల్ని ప్రస్తావించిన చంద్రబాబు..విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలికి తక్షణ న్యాయం చేయాలని కోరారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒకచోట మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరగడం ఎంతో బాధిస్తోందని చంద్రబాబు సీఎం జగన్ కు రాసిన లేఖలో తెలిపారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే అభం శుభం తెలియని చిన్నారులు నుంచి వృద్ధుల వరకూ కిరాతకుల ఆగడాలకు బలవుతున్నారని, రాష్ట్రంలో విద్యార్థినులు,యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతుండటం దురదృష్టకరమని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో బడికి వెళ్లే బాలికలకు, కాలేజీలకు వెళ్లే యువతులకు, మార్కెట్ కు వెళ్లే మహిళలకు, ఉద్యోగాలు చేసుకునే ఆడబిడ్డలకు రక్షణ లేదని ఆరోపించారు.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన తనను ఎంతో కలిచివేసిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వాస్పత్రిలోని ఒక రూమ్ లో దివ్యాంగురాలికి 30 గంటలపాటు ముగ్గురు మృగాళ్లు మద్యం తాగి నరకం చూపించడం రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉందో అర్ధమవుతోందన్నారు. తల్లిదండ్రుల ఎదుటే బిడ్డపై అత్యాచారానికి పాల్పడ్డారంటే... ఏం చేసినా ప్రభుత్వం శిక్షించదనే ధైర్యంతోనే కిరాతకులు రెచ్చిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. కూతురు కనిపించడంలేదని స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అమానుషమన్నారు. మహిళా భద్రతను వదిలేసి అధికార పార్టీ సేవలో పోలీసులు తరించడం దేనికి సంకేతమని చంద్రబాబు ప్రశ్నించారు.
విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని, ప్రజాగ్రహం చూసి భయపడి ఆదరాబాదరగా హోంమంత్రి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఘటనాస్థలానికి వచ్చారని చంద్రబాబు తెలిపారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. బాధితులకు అండగా నిలబడి న్యాయం చేయమని కోరితే తమ బాధ్యతను మరిచి తమపై ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
దిశా చట్టం ఆర్భాటపు ప్రచారానికే పరిమితమైందని, దిశా చట్టం ప్రకారం 21 రోజుల్లో నిందితులకు శిక్ష వేస్తామని మీరు చేసిన వాగ్దానం ఏమైందని సీఎం జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో దిశా చట్టం అమల్లో ఉందా? ఎన్ని కేసులను నమోదు చేశారు? ఎంతమందిని శిక్షించారు?అనే ప్రశ్నలకు నేటికీ మీ నుంచి సమాధానం లేదన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారని, నేటికీ ఆ దిశగా చర్యల్లేవన్నారు.
మహిళలకు రక్షణ కల్పించలేని మీకు పాలన చేసే అర్హత ఎక్కడుందని చంద్రబాబు సీఎం జగన్ ను ప్రశ్నించారు. అధికార వైసీపీ నేతలే కాలకేయుల అవతారమెత్తి ఆడవారిపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు.
గుంటూరు జిల్లాలో చిన్నారిపై అధికార పార్టీ నేతలు భూ శంకర్, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అఘాయిత్యానికి పాల్పడి వ్యభిచార గృహానికి అమ్మేశారని, వీరితోపాటు ఈ ఘటనతో ప్రమేయమున్న 70 మందిపై నేటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి ఇంటి పక్కనే సీతానగరంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ పట్టుకోలేదన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజధాని ప్రాంతం పెదకాకానిలో దళిత విద్యార్థిని రమ్యను పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపితే నిందితుడికి నేటికీ శిక్ష పడలేదన్నారు.పులివెందులలో నాగమ్మ, అనంతపురంలో స్నేహలత, నరసరావుపేటలో అనూష, రాజమండ్రిలో మైనర్ మీద గ్యాంగ్ రేప్ ...ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమైనా ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారని జగన్ ను ప్రశ్నించారు. నెల్లూరులో విదేశీ యువతిపై అత్యాచార యత్నం అంతర్జాతీయస్థాయిలో రాష్ట్ర పరువు పోయిందని చంద్రబాబు గుర్తుచేశారు.
బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా మీ చర్యలు, మీ విధానాలు మహిళలపై నేరాలకు పాల్పడే దుర్మార్గులకు ప్రాణభయం కలిగించే విధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇకనైనా మహిళా భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించి, శాంతిభద్రతలు కాపాడండన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడటం మాని శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ఉపయోగించండని తెలిపారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధిత యువతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని, కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు, శాశ్వత నివాసం, జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వెంటనే పరిష్కరించి దోషులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications