'విజన్' అనేది ఆయన శ్వాస... జీవనాడి?
ఆయన అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయితే ఎవరూ ఆయన్ని ముఖ్యమంత్రి అని పిలవరు. ఒక కంపెనీకి సీఈవోగా పిలుస్తారు. అందుకు తగ్గట్లుగానే ఆయన వ్యవహారశైలి ఉంటుంది. కంపెనీ అభివృద్ధి చెందడానికి, భవిష్యత్తులో పోటీ సంస్థల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇప్పటినుంచే ఆయన వ్యూహాలు రూపొందిస్తారు. మధ్య మధ్యలో పలువురు రాజకీయనేతలు ''సార్.. మీరు ఒక రాజకీయ పార్టీ నేతగా ఉన్నారు.. మీరు ముఖ్యమంత్రి'' అని గుర్తుచేసిన సందర్భాలున్నాయి.
డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్ తో పరిష్కారం
ప్రస్తుతం మరోసారి చంద్రబాబు 'విజన్' అందరినీ ఆకట్టుకుంది. దీన్ని ప్రధానమంత్రి కొనియాడటంతోపాటు ప్రత్యేకంగా తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకరకంగా ఇది టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జీ20 కి ప్రస్తుతం భారత్ నాయకత్వం వహిస్తోంది. దీన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఆహ్వానం పంపి వారి సూచనలు స్వీకరించింది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ఇచ్చిన సుదీర్ఘ ఉపన్యాసం, డెమోగ్రఫిక్ మేనేజ్ మెంట్ తో సమస్యలను ఎలా పరిష్కరించవచ్చనేది అతిథులందరినీ ఆకర్షించింది.
అబ్దుల్ కలాం సూచించేవారు..
రానున్న తరంలో ప్రపంచవ్యాప్తంగా యువతరం ఎక్కువగా ఉండే దేశం ఇండియా ఒక్కటే అవుతుంది. ఇదే విషయాన్ని దివంగత అబ్దుల్ కలాం అనేక విషయాల్లో ప్రస్తావిస్తూ యువతను ఉపయోగించుకోవాలని ప్రభుత్వానికి సూచనలు జారీచేసేవారు. రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించి ఒక సమగ్ర విజన్ రూపొందించుకోవాలని బాబు చెప్పారు. ఎందుకంటే 2047 నాటికి భారతీయుల సగటు వయసు పెరుగుతుంది. అప్పుడు దీన్ని అధిగమించాలంటే కష్టమవుతుంది. ఇప్పటినుంచే ఒక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
నరేంద్రమోడీ నాయకత్వంలో..
నరేంద్రమోడీ నాయకత్వంలో 'ఇండియా ఎట్ హండ్రెడ్ ఇయర్స్- గ్లోబల్ లీడర్'పేరుతో విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశానికి వచ్చినవారెవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. దీంతో అందరి దృష్టిచంద్రబాబుపై పడింది. ప్రధానమంత్రి తన ఉపన్యాసంలో దీన్ని ప్రస్తావించడంతోపాటు చంద్రబాబుతో వ్యక్తిగతంగా మాట్లాడిన సమయంలో కూడా మోడీ ఇదే విషయాన్ని చెప్పారు. విజన్ 20-20 రూపొందించినప్పుడు అందరూ ఎగతాళి చేశారని, ఇప్పుడు ఆ విజనే ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థిక ఫలాలందిస్తోందని తెలుగుదేశం శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. రాజకీయ నాయకులకు కేవలం రాజకీయాలే కాకుండా దేశ, రాష్ట్రాల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోవాలనేది మరోసారి స్పష్టమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.