చంద్రబాబు వ్యూహం... 'తటస్తుల కోటా'!
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాల్సిందేనని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు, నియోజకవర్గ ఇన్ఛార్జిలకు, శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. గతంలోలా కాకుండా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వబోతున్నట్లు పార్టీ నేతలకు తెలియజేశారు. అంతేకాకుండా తన సర్వేలో ఎవరికైతే విజయావకాశాలుంటాయో.. వారికే టికెట్లు కేటాయించడంతోపాటు తటస్తుల కోటాలో కొందరిని పార్టీలోకి తీసుకొని వారికి కూడా టికెట్లు కేటాయించబోతున్నట్లు చెప్పేశారు.

గతానికి భిన్నంగా చంద్రబాబు
జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి భారంగా మారిన సీనియర్లందరినీ ఈసారి ఎన్నికల్లో వదిలించుకోబోతున్నారు. పలువురు సీనియర్ నేతలకు టికెట్లు లేవని ఇప్పుడే చెప్పేశారు. గతంలో మొహమాటానికి పోయి గెలుపు అవకాశాలు లేవని తెలిసినప్పటికీ సీనియర్లకు టికెట్లిచ్చి ఇప్పుడు అధికారం లేకుండా ఉన్నారు. మరోసారి ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. అందుకే గతానికి భిన్నంగా ఏడాదిన్నర ముందుగానే నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.

పూర్తి సమాచారం సేకరించిన చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులను వేధింపులకు గురిచేసినా కార్యకర్తలను సంఘటిత పరచడంలో సీనియర్లు విఫలమయ్యారని చంద్రబాబు స్పష్టతకు వచ్చారు. ఈ మూడున్నర సంవత్సరాల్లో నియోజకవర్గాల్లో ఎవరు బాగా పనిచేశారు? ఎవరు వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచి కార్యక్రమాలు నిర్వహించారు? దూరంగా ఉన్న నేతలెవరు? పార్టీకోసం పనిచేయకుండా వైసీపీ నేతలతో లాలూచీ పడినవారెవరు? ఇత్యాది విషయాలపై చంద్రబాబు పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించారు.

తటస్తుల కోటాలో టికెట్ల కేటాయింపు?
తన దగ్గరున్న సమాచారం ప్రకారమే రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించబోతున్నారు. అందులో పార్టీకి ఎప్పటినుంచో సేవలందిస్తున్న పలువురు సీనియర్లకు మాత్రం మినహాయింపునిచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే వీరెవరూ గెలుపు గుర్రాలు కాదని బాబు సర్వేలో స్పష్టమైంది. అవసరమైతే కొత్త అభ్యర్థులను తటస్తుల కోటా నుంచి దింపడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
1999లో ఏ తరహా ప్రయోగమైతే గెలిచి విజయం సాధించారో అదే తరహా ప్రయోగం మరోసారి చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications