పదవులు అనుభవిస్తున్నారు.. పనిచేయరా ? : పద్దతి మార్చుకోండి - పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటానికి మరింత దూకుడుతో వెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే చర్చలు తప్పవని హెచ్చరించారు.
అనుబంధ విభాగాల పనితీరుపై అసంతృప్తి
తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిపెట్టారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుతో ముందుకు వెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీకి చెందిన 20 అనుబంధ విభాగాల అధ్యక్షులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విభాగాల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత క్రియాశీలకంగా విభాగాలు పనిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు అనుబంధ విభాగాల పనితీరును సమీక్షిస్తానని చెప్పారు..
ఎవరి పనితనం ఏమిటో అంతా తెలుసు..
పార్టీ అనుబంధ విభాగాలలో రెండు.. మూడు కమిటీలు తప్ప మిగతా విభాగాలు సరిగా పనిచేయడంలేదని చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఆ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే కుదరదన్నారు. ఎవరి పనితనం ఏమిటో.. ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో తనకు అంతా తెలుసున్నారు. ప్రతి విభాగం పనితీరు రిపోర్టు ఉందన్నారు. పార్టీలోని ప్రతి అనుబంధ విభాగాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ నేతలకు సూచించారు.
పదవులు తీసుకుని పనిచేయకుంటే చర్యలు..
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా.. పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగేతే ప్రయోజనం లేదని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కొందరు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారు పద్దతి మార్చుకోవాలని సూచించారు. పార్టీని బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు . ప్రజల వెంట నడవాలన్నారు. ప్రభుత్వ దుర్మార్గపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.