అతనికి ఎంపీ సీటు ఇవ్వొద్దంటూ చంద్రబాబుపై అమిత్ షా ఒత్తిడి?
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ తాజాగా తన మూడో జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా 25 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 17 స్థానాల్లో పోటీపడుతోంది. రెండు స్థానాల్లో జనసేన, ఆరు స్థానాల్లో బీజేపీ పోటీచేస్తాయి. ప్రస్తుతానికి 13 ఎంపీ నియోజకవర్గాల్లో పోటీపడే అభ్యర్థుల జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. నాలుగు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో ప్రధానమైన నియోజకవర్గం ఒంగోలు.
ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొద్దిరోజుల క్రితమే టీడీపీలో చేరారు. ఎంపీ సీటును తన కుమారుడికి కేటాయించాలనే అభ్యర్థనతో ఆయన పార్టీ మారారు. శ్రీనివాసులరెడ్డి తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నారు. కొన్నాళ్లు జైల్లో ఉన్న తర్వాత అప్రూవర్ గా మారి బయటకు వచ్చారు. ఇదే కేసులో కల్వకుంట్ల కవితతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. వీరిద్దరి రిమాండ్ రిపోర్ట్ లో రాఘవ పేరు పదే పదే వినిపిస్తోంది. దీంతో ఆ కేసులో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్ కేటాయించొద్దంటూ చంద్రబాబుకు బీజేపీ షరతు పెట్టినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ కుమార్తె కవిత రాఘవరెడ్డి నుంచి రూ.30 కోట్లు వసూలు చేసి ఆప్ నేతలకు అందజేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే వైసీపీ కూడా ఆయన్ను పక్కన పెట్టిందంటున్నారు. ప్రత్యేకంగా రాఘవరెడ్డికి టికెట్ కేటాయించడం సబబు కాదని, అతన్ని దూరం పెట్టాలంటూ బీజేపీ అధిష్టానం నుంచి రోజురోజుకు చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ కారణంవల్లే ఒంగోలు స్థానాన్ని చంద్రబాబు పెండింగ్ లో పెట్టారంటున్నారు. చివరకు రాఘవరెడ్డికి టికెట్ వస్తుందా? టీడీపీ నుంచి పోటీచేస్తారా? బీజేపీ నుంచి ఒత్తిడి తగ్గుతుందా? అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications