మే లేదా అక్టోబర్లో ఏపీలో ముందస్తు ఎన్నికలు - తేల్చేసిన చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరోసారి ముందస్తు ఎన్నికల గళం వినిపించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి సమాయాత్తమౌతోందనే వార్తలు వ్యక్తమౌతోన్న వేళ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని ఇచ్చాయి. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు కొట్టిపారేయలేనివిగా మారాయి.

జనం మధ్యే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. జిల్లాల పర్యటనలతో జనం మధ్యే ఉంటోన్నారు. బహిరంగ సభల్లో తన ప్రసంగం శైలినీ మార్చారు. ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలు, అమలులో ఉన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూనే- ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలను సంధిస్తోన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై చురకలు అంటిస్తోన్నారు. ఆయన ప్రసంగాల తాలూకు విమర్శలు జనంలోకి వెళ్తోన్నాయి.

చంద్రబాబు కూడా..
చంద్రబాబు ఇప్పటికే జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. బాదుడే బాదుడు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇదివరకు ఆయన కర్నూలు జిల్లాలో పర్యటించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుడిగాలి పర్యటలను నిర్వహించారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్గా చేసుకున్నారు. త్వరలోనే ఉమ్మడి కృష్ణాజిల్లాలో.. ఈ కార్యక్రమాలను చేపట్టనుంది తెలుగుదేశం పార్టీ.

ముందస్తు సంకేతాలు..
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఓటమి భయంతో వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఓటమి భయంతో ముందస్తుకు వెళ్లనున్నారని అన్నారు.

ఓటమి తప్పదు..
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా, ముందస్తుకు వెళ్లినా వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని పునరుద్ఘాటించారు. 13వ తేదీ నాటికీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ప్రజలందరికీ న్యాయం చేస్తామని, ఉద్యోగులకు సకాలంలో వేతాలను చెల్లిస్తామని చెప్పారు.

వైసీపీపై అసంతృప్తి..
అధికార పార్టీపై ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి నెలకొని ఉందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజలు ఆదరిస్తోన్నారని అన్నారు. తాము చేపట్టే ఆందోళనల్లో పాల్గొనే వారికి పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాల లబ్దిని నిలిపివేస్తామని వలంటీర్లు బెదిరిస్తోన్నారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ జగన్ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ధ్వజమెత్తారు. తలసరి ఆదాయంలో వెనకంజ వేయడానికి ఈ విధానాలే కారణమని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications