ఏపీలో లాక్డౌన్ - పరీక్షలు రద్దు చేయాల్సిందే- ప్రభుత్వానికి సహకరిస్తాం- చంద్రబాబు
ఏపీలో కరోనా విజృంభణ నేపథ్యంలో వైసీపీ సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సంతృప్తి కరంగా లేవని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మొక్కుబడి చర్యలతో కాలయాపన చేస్తోందని, ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వానికి అవసరమైతే సహకారం అందించేందుకు సిద్దమన్న చంద్రబాబు.. రాష్ట్రంలో పరిస్దితిని బట్టి లాక్డౌన్ విధించాలని సీఎం జగన్ను కోరారు.

ఏపీలో లాక్డౌన్ పెట్టాలన్న చంద్రబాబు
ఏపీలో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న చోట లాక్డౌన్ పెట్టుకుని వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతిని తాకట్టుపెట్టొద్దని సీఎం జగన్ను కోరారు. దేశ, విదేశీ వైద్య నిపుణుల సహకారంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వానికి తమ వంతు సహకరిస్తామని చంద్రబాబు తెలిపారు. పార్టీ పరంగా ఎంతవరకు సాయమందించగలమో అంత వరకూ చేస్తామన్నారు. పార్టీలకతీతంగా, విమర్శలకతీతంగా కరోనాను ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వాలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు. కాలయాపన, ప్రభుత్వ అసమర్దత కారణంగా చాలా నష్టపోయామని, ప్రభుత్వ లెక్కలకీ, క్షేత్రస్ధాయిలో పరిస్దితికీ పొంతనలేకుండా పోతోందన్నారు. ప్రపంచమంతా భారత్ గురించి, అందునా ఏపీ గురించే మాట్లాడుతున్నాయని,
టెస్టులు తక్కువగా ఉండటం వల్లే కేసులు తక్కువగా కనిపిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. శవం ఇంట్లో పెట్టితాళం వేసినంతమాత్రాన కుళ్లిపోయి వాసనరాకుండా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.

పనిచేయని వారిపై ప్రశ్నిస్తే కేసులా ?
రాష్ట్రంలో కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే పోలీసులు కేసులు పెడతామంటున్నారు. కానీ వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.. ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం మాట్లాడొద్దంటే ఎలా, మీ చేతకానితనానికి ప్రజలు బాధపడుతూ చెప్పుకోలేని పరిస్ధితి కూడా వస్తే దారుణం అని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఏపీకి రాకపోకలు బంద్ చేస్తున్నాయి
ఏపీలో పరిస్ధితిపై పొరుగు రాష్ట్రాలు భయపడుతున్నాయని చంద్రబాబు తెలిపారు. ఏపీలో కరోనా చర్యలు తీసుకున్నామని చెప్పుకోవడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. కరోనాపై మీరిచ్చిన జీవోలు ఎక్కడైనా అమలయ్యాయా ? ప్రశ్నించే వారిని బెదిరిస్తారా ? అందరినీ కలుపుకుని ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన తెలిపారు.

విద్యార్ధుల ప్రాణాలకు జగన్ గ్యారంటీ ఇస్తారా ?
కేంద్రం దేశవ్యాప్తంగా పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో మాత్రం పరీక్షలు పెట్టి తీరుతామంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వానికి ఎందుకీ పట్టుదల అని ప్రశ్నించారు. తల్లితండ్రుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోదా అని నిలదీశారు. విద్యార్ధుల ప్రాణాలను పణంగా పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనాలో పరీక్షలు నిర్వహించి విద్యార్ధుల ప్రాణాలకు సీఎం జగన్ గ్యారంటీ ఇస్తారా అని అడిగారు. భారత్లో పరిస్ధితి చూస్తుంటే తమ గుండెలు పగిలిపోతున్నాయని మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలు సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చాయా్ వంటి వాళ్లు బాధపడుతున్నారని, కానీ వారికున్న బాధ సీఎం జగన్కు లేకుండా పోయిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో పరిస్ధితుల్ని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కుప్పలు తెప్పలుగా మనుషులు చనిపోతుంటే సీఎం ప్రజల ఆరోగ్యాన్ని కాపడకుండా చోద్యం చూస్తున్నారని ఆక్షేపించారు.
Recommended Video

జగన్ మూర్ఖత్వంతోనే ఇలాంటి పరిస్దితి
దేశవ్యాప్తంగా పలు రాష్టాలు లాక్డౌన్ పెట్టాలనే ఆలోచనలో సర్వత్రా ఉంటే పరీక్షలు పెట్టాలని చూడటం తగదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదని... విద్యార్థులకు రవాణా, ఇతర విధాలుగా కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. 18 ఏళ్ల పైబడిన వారికి టీకా ఇచ్చే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా పరీక్షలు వాయిదా వేస్తే, జగన్ వారికంటే మేధావా అని నిలదీశారు. వితండ వాదం, మూర్ఖత్వంతోనే రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications