జగన్ పై చంద్రబాబు రివర్స్ అస్త్రం - అక్కడే చిక్కుముడి : ఢిల్లీలో తేలితే, ఇక ముందుకే..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్లీనరీ వేదికగా తన ఎన్నికల నినాదం దాదాపుగా ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్ పూర్తి తన సంక్షేమ పథకాలే ఓట్లు కురిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమానికి వ్యతిరేకంగా వేసినట్లేనంటూ కొత్త నినాదం అందుకున్నారు. అదే సమయంతో టీడీపీని పెత్తందారీ పార్టీగా అభివర్ణించారు. తమది పేదల పార్టీగా చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇదే తరహాలో సంక్షేమం అమలు చేస్తానని చెప్పినా.. చేయరనే విధంగా చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు - వాటిని విస్మరించిన తీరు గుర్తు చేస్తూ.. విశ్వసనీయతను దెబ్బ తీయటం పైన ఫోకస్ పెట్టారు.
ఎన్నికలకు జగన్ స్లోగన్ క్లియర్
ఇదే సమయంలో అభివృద్ధి లేదనే విమర్శలకు...నేటి కంటే రేపు మెరుగ్గా జీవించటమే అభివృద్ధి అంటూ విశ్లేషణ చేస్తున్నారు. సామాజిక న్యాయం పేరుతో తాను ఎస్సీ - ఎస్టీ- బీసీ - మైనార్టీ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి పదే పదే వివరిస్తూ.. ఆ వర్గాలు తనతోనే ఉంటాయనే ధీమాతో జగన్ కనిపిస్తున్నారు.
ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం ప్రజల్లో మూడేళ్లలోనే జగన్ పాలన పైన వ్యతిరేక వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే గెలుపు అని చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా యువత - ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నారు. అభివృద్ధి అనేదే లేదని..టీడీపీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమంటూ చంద్రబాబు ప్రజల మధ్యకు వచ్చి హైదరాబాద్ - అమరావతి అంశాలను ప్రస్తావిస్తున్నారు.
వ్యూహం సిద్దం చేస్తున్న చంద్రబాబు
ఇక, జగన్ ను రాజకీయంగా ఇరకాటంలో నెట్టేందుకు..జగన్ గతంలో ఇచ్చిన హామీలు - అమలు కాని విధానం పైన ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతు అవసరం అయినా.. కనీసం హోదా కోసం ప్రస్తావన చేయదలేదనేది టీడీపీ నేతల వాదన.
ఈ అస్త్రం జగన్ పైన ప్రయోగించే క్రమంలోనే టీడీపీ ఇప్పటి వరకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశం పైన క్లారిటీ ఇవ్వకుండా తటస్థంగా వ్యవహరిస్తోంది. తమను అటు ఎన్డీఏ..ఇటు జాతీయ స్థాయిలో విపక్షాలు సంప్రదించకపోవటంతో..ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది.
సంక్షేమం వర్సస్ అభివృద్ధి
2019 ఎన్నికల ముందు నాటి ప్రతిపక్ష హోదాలో జగన్ ప్రత్యేక హోదా అంశం పైనే తన ఎంపీలతో రాజీనామా చేయించి..టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేలా ట్రాప్ చేయటం లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు..చంద్రబాబు సైతం రివర్స్ లో ఇదే ప్లాన్ అమలుకు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. అయితే, టీడీపీ - జనసేన రెండు పార్టీలు బీజేపీతోనూ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనేది టీడీపీ అధినేత వ్యూహంగా సమాచారం. ఇప్పటికిప్పుడే ప్రత్యేక హోదా అంశం లేవెనెత్తితే బీజేపీతో పాటుగా.. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ సైతం రాజకీయంగా ఇరకాటంలో పడతారు.
బీజేపీతో ఇక పొత్తు లేదనే పూర్తి నిర్ణయానికి వస్తే..జగన్ లక్ష్యంగా హోదా అంశం పైన జగన్ ను ఇరకాటంలోకి నెట్టాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, సంక్షేమ నినాదంతో జగన్. .హోదా - అభివృద్ధి స్లోగన్స్ తో టీడీపీ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. దీంతో..ఈ రెండు పార్టీల ప్రచారాస్త్రాల్లో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది తేలాల్సి ఉంది.