జిల్లాల టూర్ కు చంద్రబాబు శ్రీకారం-ఎల్లుండి నుంచి రాయలసీమలో- వరదల పరామర్శ
ఏపీ అసెంబ్లీలో నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల దూషణలతో నొచ్చుకున్న చంద్రబాబు అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో తేల్చుకున్నాకే తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన ఎల్లుండి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు.
ఈ నెల 22 నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయ్ంచారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు చంద్రబాబు రాయలసీమ జిల్లాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలోని టీడీపీ నేతలతో చంద్రబాబు ఇవాళ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అక్కడ వాస్తవ పరిస్ధితిని నేతలతో అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల ప్రభావం ఏయే చోట్ల ఉండో వివరాలు తీసుకున్నారు.
భారీ వర్షాలతో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయని చంద్రబాబుకు నేతలు తెలిపారు. దీంతో వరద బాధితులకు అండగా నిలవాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలని సూచించారు. వరద బాధిత ప్రజలకు ప్రభుత్వం కంటే ముందే సేవలు అందించేందుకు టీడీపీ రంగంలోకి దిగిందన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్తో సమన్వయం చేసుకుని టీడీపీ నేతలు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించాలని చంద్రబాబు వారికి సూచించారు. తాను ఎల్లుండి నుంచి రాయలసీమ జిల్లాలతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని నేతలకు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ బహిష్కరణ నేపథ్యంలో చంద్రబాబు అడుగులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. త్వరలో ప్రజల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముందుగా వైసీపీకి బలమైన రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా కుప్పంలో టీడీపీ ఓటమి నేపథ్యంలో చంద్రబాబు సీమ టూర్ కీలకంగా మారింది.