థాయ్లాండ్లో చంద్రబాబు విహారయాత్ర: కుటుంబంతో సహా: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా గుడుపుతున్న ఆయన వారం రోజుల పాటు ఒత్తిళ్లకు దూరంగా ఉండనున్నారు. రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన వన్ టైమ్ సెటిల్మెంట్, సినిమా టికెట్ల ధరల తగ్గింపు..వంటి సమకాలీన అంశాలపై తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం చేస్తోన్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉంటూ ఏపీలో పార్టీకి మార్గదర్శనం చేస్తోన్నారు.

పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్లు చెబుతోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధానాలను రోజూ ఎండగడుతున్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు రోజూ గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాలను నిర్వహిస్తోన్నారు. జగన్ సర్కార్పై విమర్శనాస్త్రాలను సంధిస్తోన్నారు. ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక విషయం మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో ఉంటోన్నారు.

చక్రబంధంలో సర్కార్..
ప్రభుత్వంపై యుద్ధానికి పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయడంలో చంద్రబాబు నాయుడిది కీలక పాత్ర. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ఆయన రోజూ జూమ్ కాల్ ద్వారా పార్టీ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తోన్నారు. రోజువారీ షెడ్యూల్ను నిర్దేశిస్తున్నారు. క్యాడర్లో నిస్తేజం అలముకోకుండా ప్రతిరోజూ వారిని కార్యోన్ముఖులను చేస్తోన్నారు. అధికార పార్టీని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి, ఇబ్బందుల్లో నెట్టడానికి, చక్రబంధంలో ఇరికించడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడంలో చంద్రబాబు దిట్ట.

ఒత్తిళ్ల నుంచి విశ్రాంతి..
కరోనా వైరస్, ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లో కొంతకాలంగా ఆయన హైదరాబాద్కే పరిమితం అయ్యారు. ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడుపుతున్నారు. ఇలా రోజువారీ రాజకీయ కార్యకలాపాలతో తీరిక లేకుండా గడుపుతోన్న చంద్రబాబు విశ్రాంతిని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన విహారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని, థాయ్లాండ్కు వెళ్లారని తెలుస్తోంది. కుటుంబంతో సహా థాయ్లాండ్కు వెళ్లినట్లు చెబుతున్నారు.

కుటుంబంతో కలిసి..
భార్య భువనేశ్వరి, కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్తో కలిసి చంద్రబాబు థాయ్లాండ్లో విహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియరావట్లేదు. ఆయన దేశంలో లేరనేది నిర్ధారించినప్పటికీ- ఎక్కడికి వెళ్లారనేది స్పష్టం కావట్లేదు. విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి చూస్తోంటే- థాయ్లాండ్కే వెళ్లారని అంటున్నారు.

న్యూ ఇయర్ అక్కడే..
కొత్త సంవత్సరం వేడుకలను చంద్రబాబు థాయ్లాండ్లోనే జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. జనవరి 2వ తేదీ అంటే వచ్చే ఆదివారం ఆయన మళ్లీ రాష్ట్రానికి చేరుకుంటారని అంటున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన కావడం వల్ల అధికారికంగా సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. పార్టీలో కొంతమంది కీలక నాయకులకు మాత్రమే చంద్రబాబు.. తన కుటుంబంతో సహా థాయ్లాండ్ విహారయాత్రకు వెళ్లారనే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications