వ్యవసాయ చట్టాల రద్దును స్వాగతించిన చంద్రబాబు-మూడు రాజధానుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాల్ని త్వరలోనే వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోడీ ఇవాళ చేసిన ప్రకటనను ఏపీలో వివక్ష టీడీపీ స్వాగతించింది. ప్రధాని మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో పలు కీలక విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోందని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. రైతుల ఆందోళనలకు స్పందించి బిల్లులు వెనక్కు తీసుకోవడం సముచితం అని ఆయన అన్నారు. రైతుల సంక్షేమానికి చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, వాటి మీద దృష్టి పెడుతున్నామని ప్రధాని చెప్పడం అభినందనీయమని చంద్రబాబు తెలిపారు.
అదే సందర్భంలో ఏపీలో 34 వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు 700 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు 13 జిల్లాల నుండి పెద్ద స్థాయిలో సంఫీుభావం వస్తోందని ఆయన తెలిపారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలకు పైగా వుండాలని, అమరావతి రాజధానికి నాడు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేతతో సహా సభ్యులందరూ మద్దతు తెలిపాలని చంద్రబాబు గుర్తుచేశారు. చట్ట ప్రకారం రైతాంగానికి ప్రభుత్వం అగ్రిమెంట్ ఇచ్చిందని, అమరావతిని ఏకైక రాజధానిగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించారని చంద్రబాబు వెల్లడించారు.
అమరావతిలో రైతులు ఇచ్చిన భూముల ద్వారా ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్ల ఆస్తి సమకూరిందని, అమరావతి అభివృద్ధి అయితే 13 జిల్లాల అభివృద్ధికి నిధుల కొరత ఉండదని చంద్రబాబు తెలిపారు. అమరావతి అభివృద్ధితో 175 నియోజకవర్గాల యువతకు ఉద్యోగాలు, ఉపాధి వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రం బాధ్యతన్నారు. కాబట్టి మూడు సాగు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకొన్న విధంగా మూడు రాజధానుల నిర్ణయం ఉపసంహరించుకోవడం ద్వారా అమరావతి రైతాంగ ఆకాంక్షయే కాక రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గౌరవించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.