పండగ వేళ- ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు లేఖ..!!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. ఉగాది పండగ వేళ- ఆయన వ్యవసాయం, రైతాంగం ఎదుర్కొంటోన్న ఇబ్బందులను ఈ లేఖలో వివరించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ స్థితిగతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలని, రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
ఏపీలో ఇటీవల భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిశాయి. అన్నమయ్య రాయచోటి, ప్రకాశం జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఉత్తరాంధ్రలోని పాడేరు, అరకు, పార్వతిపురం ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

అరకులో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణం కేంద్రం తెలిపింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగు పడటంతో ఓ వ్యక్తి మరణించాడు. ప్రకాశం జిల్లా గోళ్లవిడిపిలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. అనంతపురం సహా పలు జిల్లాల్లో వడగండ్లతో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చేతికి అందిన పంట నీటిపాలైంది. వడగాండ్ల వర్షానికి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.
పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. చేతికొచ్చిన పంటలు అకాల వర్షంతో దెబ్బతిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చిన సమయంలో ఆకాలంగా కురిసిన భారీ వర్షలు తమను నష్టాలపాలు చేశాయంటూ కన్నీరుమున్నీరయ్యారు. అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చిన వ్యవసాయోత్పత్తులు పూర్తిగా తడిసిపోయాయి. నష్టపోయిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఈ పరిస్థితులపై చంద్రబాబు స్పందించారు. అకాల వర్షాలతో రైతాంగం తీవ్రంగా దెబ్బతిందని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ ఆయన కేఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. పిడుగులు పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం అందించాలని కోరారు. ఉద్యాన, వాణిజ్య పంటల నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వడగళ్ల వాన వల్ల పలు నివాసాలు దెబ్బతిన్నాయని వాటికి కూడా పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications