టీడీపీ పొలిట్బ్యురోలో కీలక తీర్మానం: మోదీకి పంపిన చంద్రబాబు: జగన్ కంటే రెట్టింపు సంక్షేమం
అమరావతి: తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యురో ఇవ్వాళ సమావేశమైంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఈ భేటీ ఏర్పాటైంది. కీలక అంశాలపై చర్చించింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఇతర పార్టీలతో కుదుర్చుకోవాల్సిన ఉన్న పొత్తులతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటంలో భాగంగా పొత్తులు అనివార్యమని పేర్కొంది.
టీడీపీ పొలిట్ బ్యురో ఇవ్వాళ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమావేశమైంది. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దీనికి అధ్యక్షత వహించారు. రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య.. ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన సహా పలు అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి సీపీఐ ఇటీవలే సంసిద్ధతను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ కే నారాయణతో పాటు రాష్ట్రశాఖ కార్యదర్శి రామకృష్ణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్లు చెప్పారు. అటు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన కూడా తెలుగుదేశంతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడానికి ఆసక్తిగా ఉందనేది తెలిసిన విషయమే. ఆయా అంశాలన్నీ కూడా పొలిట్ బ్యురో భేటీలో ప్రస్తావనకు వచ్చాయి.

ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయాలని చంద్రబాబు పొలిట్ బ్యురో సభ్యులకు సూచించారు. ఏపీలో సంక్షేమం పేరుతో వైఎస్ఆర్సీపీ నాయకులు దోపిడీకి పాల్పడుతున్నారని, అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి రూపాయి కూడా పేద ప్రజలు, అర్హులైన లబ్దిదారులకు అందేలా సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టేలా ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయాల్సి ఉంటుందని చంద్రబాబు అన్నారు.

కాగా- పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆయన ఫొటోను ముద్రించిన 100 రూపాయల నాణేన్ని విడుదల చేయడాన్ని టీడీపీ పొలిట్ బ్యురో స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలిపింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని చంద్రబాబు.. ప్రధానికి పంపించారు. ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు.












Click it and Unblock the Notifications