టిడిపి తో అక్కడ చేతులు కలుస్తాయా..! అమరావతిలో కొత్త సమీకరణాలు.
ఏపిలో టిడిపి తో చేతులు కలుస్తాయా. ఢిల్లీలో కలిసిన చేతులు..అమరావతిలో కలవాలంటే అంత సులువుగా కనిపించ టం లేదు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ -టిడిపి కలిసి ఒకే కూటమి లో ఉన్నాయి. కానీ, ఏపిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే టిడిపి తో పొత్తు కారణంగా కొందరు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసారు. ఇటు టిడిపి లోని సీనియర్లు సైతం ఏపి లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చెబుతున్నారు. ఏది ఏమైనా..డిసెంబర్ 11 తరువాతే దీని పై ఓ స్పష్టత రానుంది.
ఏపిలో పొత్తు సాధ్యమేనా
జాతీయ రాజకీయాల ఒత్తిడి కారణంగా 40 ఏళ్ల రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి.. ఒక్క అడుగు వెనక్కు తగ్గి తానే కాంగ్రెస్ అధినేత ఇంటికి వెళ్లి..కలిసానని టిడిపి అధినేత చంద్రబాబు చెబుతున్నారు. తెలంగాణ లో ఎలాగైనా కెసిఆర్ ను గద్దె దింపటమే లక్ష్యంగా టిడిపి - కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా.. 13 సీట్లు టిడిపికి కేటాయించారు. ఇక, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా..రాహుల్- చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు...
దీనికి కాంగ్రెస్ మద్దతు అవసరమని చెబుతున్న చంద్రబాబు మరి..ఏపిలోనూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తరహాలో పొత్తు సాగిస్తారా అంటే మాత్రం ఇప్పటికీ సందేహమే. కాంగ్రెస్ తో కలిసి పని చేయటం ఏపి లో నెలకొన్న రాజకీయాల్లో అంత సులువైన విషయం కాదు. ఇప్పటికే అక్కడి టిడిపి నేతలు సైతం ఏపిలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు ఉండదని చెబుతున్నారు. అయితే, తెలంగాణలో పొత్తు పెట్టుకొని..ఏపి లో పొత్తు పెట్టుకోకపోవటం పై మరింత రాజకీయ రగడ ఉండే అవకాశం కనిపిస్తోంది.
నో అంటున్న రెండు పార్టీల స్థానిక నేతలు..
ఒక వైపు తెలంగాణలో పొత్తు సాగుతున్న సమయంలో..ఏపిలోని టిడిపి నేతలు ఎవ్వరూ కూడా కాంగ్రెస్ తో పొత్తు పైన మాట్లాడవద్దని టిడిపి అధినాయకత్వం ఆదేశించింది. అయినా..ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఎంపి రాయపాటి లాంటి వారు మాత్రం ఏపిలో కాంగ్రెస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు. అదే విధంగా..టిడిపి తో పొత్తు రుచించ క మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, సిఆర్ రామచంద్రయ్య లాంటి వారు కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. ఇక, కాంగ్రెస్ తో పొత్తు పై అంతర్గతంగా టిడిపిలోనూ వ్యతిరేకత కనిపిస్తోంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసిపికి బదిలీ కావటంతో..వైసిపిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ తో పొత్తు మేలు చేస్తుందని...ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటానికి సహక రిస్తుందని కొందరు నేతలు వాదిస్తున్నారు. అదే సమయంలో..బిజెపి తో వైసిపి సఖ్యతగా ఉంటుందనే ప్రచారం ద్వా రా.. వైసిపి వైపు మొగ్గు చూపే మైనార్టీ- దళిత ఓటు బ్యాంకును దూరం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఏపిని విభజించిన కాంగ్రెస్..40 ఏళ్లుగా తాము పోరాడుతున్న కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని వెళ్తే..ఏపి లాంటి రాజకీయం గా చైతన్యం ఉన్న రాష్ట్రంలో ఓట్ల బదలాయింపు అంత సులువు కాదనే అభిప్రాయమూ వినిపిస్తోంది.
తెలంగాణ ఫలితాల తరువాతనే...నిర్ణయం
తాము ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి తో చేతులు కలపలేమని రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తేల్చి చెబుతున్నారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నిర్వహించిన రాయలసీమ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమా వేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ -టిడిపి పొత్తు ప్రయోగం ఎంత మేర సత్ఫలితాలను ఇస్తుందనే దాని పై ఏపి నిర్ణయం ఆధార పడి ఉంది. తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తే అది ఏపిలోనూ పొత్తు కొనసాగించటానికి మార్గం గా మారే అవకాశం ఉంది. లేని పక్షంలో అది తెలంగాణ వరకే పరిమితం అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. దీంతో..పిసిసి అధ్యక్షుడు రఘు వీరారెడ్డి సైతం డిసెంబర్ 11 తరువాతనే ఏపిలో పొత్తు పై స్పష్టత వస్తుందని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో..ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపిలో వేగంగా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.